Rahul Gandhi says: మోదీ సర్కార్ విద్యా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందా? యూనివర్సిటీల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారా? నియమాకాల్లో వేతన ప్యాకేజీలు తగ్గుతున్నాయా? దీనికి మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలే కారణమా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు కాంగ్రెస్ యువనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ.
మోదీ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ. గడిచిన పదేళల్లో బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు ఇప్పుడు యువత నిరుద్యోగులుగా మారే పరిస్థితి నెలకొందని అంటున్నారు. దీనివల్ల వర్సిటీల్లో చదివే విద్యార్థులకు తాము అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోతున్నారు ఆరోపించారు.
మోదీ సర్కార్ అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల వల్ల దేశవ్యాప్తంగా యువత నిరాశలో కూరుకు పోయిందన్నారు రాహుల్గాంధీ. వారి భవిష్యత్తు అయోమయంలో పడిందన్నారు. ఐఐటీల్లో విద్యార్థులకు వేతనాలు తగ్గుదలపై వచ్చిన వార్తలపై సోషల్మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.
Also read: సివిల్స్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించినా.. ఉద్యోగం ఇయ్యలేదు.. చివరకు..
ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన కారణంగా దేశంలోని ప్రతిష్టాత్మక వర్సిటీల్లోని విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నియామకాల్లో వార్షిక వేతన ప్యాకేజీలు తగ్గుతున్నాయని ఆందోళన చెందారు. రెండేళ్ల కిందట 19శాతం మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ దక్కలేదని, ఈ ఏడాది ఆ శాతం రెట్టింపు అయ్యిందన్నారు.
దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల పరిస్థితి ఇలా ఉంటే, మిగతా వాటి సంగతేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత. విద్యార్థుల చదువుల కోసం తల్లిదండ్రులు లక్షల్లో ఖర్చు చేస్తున్నారని అన్నారు. అధిక వడ్డీలకు విద్యా రుణాలు తీసుకుంటున్నారని, చివరకు ఉద్యోగం రావడంతో వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు. దీనికి కారణం ముమ్మాటికీ మోదీ సర్కార్ తీసుకొచ్చిన విద్యా వ్యతిరేక విధానాలే కారణమన్నారు.
ఎప్పుడూ లేనివిధంగా ఐఐటీల్లో కేంద్రప్రభుత్వ జోక్యం ఎక్కువైందనేది తరచూ వినపిస్తున్న మాట. గతంలో ఆయా సంస్థలు సొంతంగా వ్యవహరించేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నది కొందరు విద్యా నిపుణుల వాదన. ప్రతీ విషయాల్లో తల దూరుస్తోందని అంటున్నారు.