Ratan Tata Shantanu Naidu | దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా యొక్క యువ మిత్రుడిగా గుర్తింపు పొందిన శంతను నాయుడుకు టాటా మోటార్స్లో కీలక బాధ్యతలు పొందారు. అంత పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ & స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్గా శంతను నియమితులయ్యారు. ఈ విషయాన్ని శంతను తన లింక్డ్ఇన్లో స్వయంగా వెల్లడించారు.
”టాటా మోటార్స్లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్ & జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నా తండ్రి తన తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటుతో టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి ఇంటికి నడిచి వచ్చేవారు. ఆయన కోసం నేను కిటికీలో చూస్తూ ఉండేవాడిని. ఆ సంఘటన నాకు ఇంకా గుర్తుంది” అని శంతను నాయుడు తన లింక్డ్ఇన్లో రాశారు.
ఎవరు ఈ శంతను నాయుడు?
శంతను నాయుడు ఒక ఆటోమొబైల్ డిజైన్ ఇంజినీర్. ఒక రోజు రోడ్డు మధ్యలో వీధి కుక్క చనిపోయి ఉండటాన్ని గమనించిన అతను చలించిపోయాడు. ఆ తరువాత వీధి కుక్కుల సంరక్షణకు ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పడ్డాడు. తన స్నేహితులతో కలిసి వీధి కుక్కల కోసం రేడియం స్టిక్కర్లతో తయారు చేసిన కాలర్స్ని తయారు చేశాడు. తన ఇంటి పరిసరాల్లోని కుక్కలకు వాటిని అమర్చాడు. తాను చేసిన పనికి మరుసటి రోజే స్థానికుల నుంచి ప్రశంసలందుకున్నారు.
ముంబైలో ఉన్న వీధి కుక్కలన్నింటికీ ఈ రేడియం కాలర్ అమర్చాలని నిర్ణయించారు. కానీ అది డబ్బుతో కూడకున్న వ్యవహారం కావడంతో విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. ఆయన ‘వీధి కుక్కలను కాపాడేందుకు సాయం చేయాల్సిందిగా రతన్ టాటాని అడుగు. ఆయనకు కుక్కలంటే ఇష్టం’ అని సలహా ఇచ్చాడు.
మోటోపాస్ స్టార్టప్ స్థాపన
వీధి కుక్కలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు ‘మోటోపాస్’ పేరుతో స్టార్టప్ ఏర్పాటు చేశాడు. దానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ పూర్తి వివరాలు కలిగిన ఈ మెయిల్ను ఏకంగా రతన్టాటాకే పంపాడు. రోజులు గడుస్తున్నా ఎలాంటి రిప్లై లేకపోవడంతో తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.
చివరకు రెండు నెలల తర్వాత నేరుగా రతన్టాటా నుంచి తనని కలవాలంటూ ఆహ్వానం అందింది. రతన్టాటాతో అదే శంతను నాయుడికి తొలి పరిచయం ఏర్పడేలా చేసింది. వ్యక్తిగతంగా రతన్ టాటాను కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించాడు. వీధి కుక్కల పట్ల శంతను చూపించిన ప్రేమకు లెజెండరీ రతన్టాటా ఫిదా అయ్యారు. వెంటనే సాయం చేసేందుకు అంగీకరించారు. అలా మోటోపాస్ స్టార్టప్నకు ఆర్థికసాయం అందింది.
Also Read: 22 ఏళ్ల ఇండియన్ కుర్రాడి చేతిలో అమెరికా జాతీయ భద్రత.. అంతా మస్క్ మహిమ!
కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ
కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు రావడంతో శంతను అమెరికా బయల్దేరాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత టాటా గ్రూపులో పని చేయాలని శంతను నిర్ణయించుకున్నాడు. MBA పూర్తి చేసి ఇండియాకు వచ్చిన తర్వాత టాటా ట్రస్టులో డిప్యూటీ జనరల్ మేనేజర్(డిజీఎం) హోదాలో చేరారు. అయితే కొద్ది కాలానికే శంతను నాయుడును పిలిపించుకున్న రతన్ టాటా..తనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండాలని కోరారు. ఈ కారణంగా 2018 నుంచి 2024లో టాటా తుది శ్వాస వరకు ఆయన వెన్నంటే ఉన్నాడు.
వృద్ధులలో ఒంటరితనం దూరం చేసే గుడ్ఫెలోస్
సాటి జీవుల పట్ల శంతను నాయుడికి ఉన్న ప్రేమ రతన్టాటాను ఆకట్టుకున్నాయి. శంతను నాయుడి ఆలోచణ సరళి టాటాను ఆకర్షించింది. మోటోపాస్తోపాటు శంతను సెప్టెంబర్ 2022లో ‘గుడ్ఫెలోస్’ను స్థాపించాడు. సీనియర్ సిటిజన్ల ఒంటరితనం పోగొట్టేందుకు యువకులను మమేకం చేసేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది. ఆ తరువాత రతన్ టాటాతో ఉన్న జ్ఞాపకాలు, తన నుంచి నేర్చుకున్న విషయాలపై ‘ఐ కేమ్ అపాన్ ఎ లైట్హౌస్’ పేరుతో ఓ పుస్తకం రాశాడు.
శంతను నాయుడు యొక్క కథ అతని సామాజిక స్పృహ, సేవా భావన మరియు రతన్ టాటా వంటి మహానుభావులను ఆకర్షించే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అతని పని మరియు సాధనలు అనేకమందికి ప్రేరణను అందిస్తున్నాయి.