Fadnavis Vote Jihad| మరో మూడు రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో వాడి వేడిగా నినాదాలు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా బిజేపీ నాయకుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఓటర్లు ధర్మ యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఓట్ జిహాద్ జరుగుతోందని.. దానికి వ్యతిరేకంగా హిందూ సమాజం ఏకం కావాలని అన్నారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శనివారం ప్రతిపక్ష మహావికాస్ అఘాడి కూటమిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ, ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎన్నికల్లో మత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.
అంతకుముదు శుక్రవారం పుణె లోని ఖడక్వాస్లా నియోజకవర్గంలో దేవేంద్ర ఫడ్నవీస్ బిజేపీ ర్యాలీలో హిందూ ప్రజలు ధర్మ యుద్ధం చేయాలని అన్నారు. ర్యాలీలో ఆయన ఇస్లామిక్ నాయకుడు సజ్జాద్ నోమాని ఓట్ జిహాద్ కోసం పిలుపు ఇస్తున్న వీడియోని చూపించారు. ఆ వీడియోని చూపించి.. “ఓట్ జిహాద్ జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా?.. మేము కూడా ఓట్ల కోసం ధర్మ యుద్ధం చేస్తాం” అని అన్నారు.
Also Read: బటేంగే తో కటేంగే నినాదంపై మహారాష్ట్రలో దుమారం.. యుపి సిఎంపై బిజేపీ కూటమి ఫైర్
అయితే ఫడ్నవీస్ వ్యాఖ్యలను మహావికాస్ అఘాడీ నాయకులు తప్పుబట్టారు. ఓట్ జిహాద్ ప్రస్తావన తీసుకొచ్చిందే బిజేపీ నాయకులు. పుణె లో మెజారిటీ జనాభా ఉన్న హిందువులను ఆకర్షించడానికి ఇలాంటి రెచ్చగొట్టే నినాదాలకు ఫడ్నవీస్, బిజేపీ పాల్పడుతోందని శరద్ పవార్ మండిపడ్డారు. ఎన్నికల్లో లాభం పొందేందుకు హిందు ముస్లింల మధ్య ఫడ్నవీస్ చిచ్చు పెడుతున్నారని.. దీనికి తాము వ్యతిరేకమని అన్నారు.
మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ లీడర్ బాటాసాహెబ్ థోరాట్ మాట్లాడుతూ.. “రేపు రైతులు బిజేపీకి ఓటు వేయకపోతే వాళ్లు కూడా ఓట్ జిహాద్ చేస్తున్నట్లా?” అని ప్రశ్నించారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోల్ మాట్లాడుతూ.. “ముస్లిం సంస్థలు ఓటర్లకు ఒకే కూటమికి ఓటు వేయాలని కోరుతున్నాయి. అలాగే ఆర్ఎస్ఎస్ కూడా అదే విషయం హిందువులతో చెబుతోంది. ఇదంతా బిజేపీ చేస్తున్న కుట్ర” అని చెప్పారు.
మరోవైపు మహావికాస్ అఘాడి కూటమి ప్రచారంలో కూడా మరాఠా సామ్రాజ్యంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనాజీ దత్తోని మరాఠా ద్రోహిగా పేర్కొన్నారు. అనాజీ దత్తోని ద్రోహి అనడంపై అధికార మహాయుతి కూటమి కూడా ప్రతిపక్షాలపై విమర్శలు చేసింది. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో కుల రాజకీయం చేస్తున్నాయని విమర్శించింది. బిజేపీ బ్రహ్మణ వర్గం నాయకుడైన భల్ చంద్ర కులకర్ణి మాట్లాడుతూ.. మహావికాస్ అఘాడీ కూటమి పార్టీలు బ్రాహ్మణ విరోధులు. సమాజంలో బ్రహ్మణుల పట్ల విద్వేషం పెంచే పని ఈ పార్టీలు చేస్తున్నాయి” అని అన్నారు.