Supreme Court: సుప్రీంకోర్టులో ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ అంశం మరోసారి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. చట్టసభల్లోకి నేర నేపథ్యం ఉన్నవారు ప్రవేశించడం, వారిపై ఉన్న కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లోనే ఉండిపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల సత్వర పరిష్కారంపై సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా నేతృత్వంలో సమర్పించిన 22వ అమికస్ క్యూరీ నివేదిక, అలాగే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ గణాంకాలు అనేక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చాయి.
దేశవ్యాప్తంగా కేసుల కొండ
అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఏకంగా 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో దశాబ్దానికి పైగా మూలనపడి ఉన్న కేసులు 519 కాగా, 5 నుంచి 10 ఏళ్లుగా నలుగుతున్న కేసులు 754 వరకు ఉన్నాయి. పదవుల్లో ఉన్న సిట్టింగ్ ఎంపీలపై 335, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు విచారణ దశలో ఉన్నాయి. అంతేకాకుండా మాజీ ఎంపీలపై 269, మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరో 700 కేసుల్లో పోలీసు దర్యాప్తు ఇంకా పూర్తికాకపోగా, వాటిలో 360 కేసులు మూడేళ్లకు పైగా ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉండిపోవడం గమనార్హం.
పార్లమెంట్లో హెచ్చరిస్తున్న సంఖ్యలు
ఎడిఆర్ నివేదిక ఆధారంగా లోక్సభలోని మొత్తం 543 మంది సభ్యుల్లో 251 మందిపై ఏదో ఒక క్రిమినల్ కేసు నమోదై ఉంది. వీరిలో 170 మందిపై అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. ఇక రాజ్యసభ విషయానికి వస్తే.. మొత్తం 233 మంది సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 40 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి
తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలోని 17 మంది లోక్సభ ఎంపీల్లో 14 మందిపై కేసులు ఉండగా, 12 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 25 మంది ఎంపీల్లో 13 మందిపై కేసులు, 9 మందిపై తీవ్ర కేసులు ఉన్నట్లు ఎడిఆర్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని 174 మంది ఎమ్మెల్యేల్లో 138 మందిపై కేసులు నమోదయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలోని 119 మంది ఎమ్మెల్యేల్లో 81 మందిపై కేసులు ఉండగా, అందులో 58 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈ కేసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని, వాటి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న తీవ్రమైన నేరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే కేసులను ప్రాధాన్యతా క్రమంలో విచారించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, పికప్ వాహనం ఢీ.. 8 మంది మృతి, 32 మందికి తీవ్ర గాయాలు!