Ayodhya: స్వేచ్ఛ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం ఉదంతంలో సోమవారం రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో అత్యవసర విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఆ అవసరం లేదని పేర్కొంది. మరోవైపు విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయిన నిందితుల తరపున ఎవరూ వాదించకూడదని అయోధ్య బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది.
అత్యవసర విచారణ కోరుతూ..
రామ మందిరం నిర్మాణానికి వచ్చిన విరాళాల్లో భారీ అక్రమాలు జరిగాయని, వీటిపై అత్యవసర విచారణ జరపాలని ఇటీవల ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అందిన విరాళాల్లో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నాడు. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరాడు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని అభ్యర్థించాడు. దీనిపై సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ అంశంలో అత్యవసర ప్రాతిపదికన వెంటనే విచారణ ప్రారంభించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయ పడింది. కోర్టు సెలవులు ముగిసిన తరువాత ఈ కేసును రెగ్యులర్ బెంచ్ ముందు విచారణకు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: కాపులను జనసేనకు దూరం చేయడమే వైసీపీ ప్లాన్ – ఎమ్మెల్సీ హరిప్రసాద్
బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం..
ఇదిలా ఉండగా విరాళాల దుర్వినియోగం అంశంలో అయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితుల తరపున బార్ అసోసియేషన్ లో సభ్యునిగా ఉన్న ఏ న్యాయవాది కూడా కోర్టులో వాదించకూడదని తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే వారికి 5లక్షల జరిమానా విధిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాళికా శరణ్ మిశ్రా హెచ్చరించారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచిన రోజే జరిపిన బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. రామాలయానికి భక్తులు సమర్పించిన కానుకల దుర్వినియోగం ఆరోపణలతో తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని బార్ అసోసియేషన్ తెలిపింది. అందువల్లే సభ్యులంతా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంది.