Election Commission Issues Show Cause Notices To Dilip Ghosh, Supriya Shrinate: కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాట్లకు షాకిచ్చింది. మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు గాను దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనాట్లకు ఈసీ షోకాజ్ నోటీసులు అందజేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అటు హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి పోటీచేయనున్న సినీ నటి కంగనా రనౌత్పై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాట్ విమర్శల వర్షం గుప్పించారు. ఇరువురి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలు మర్యాదలేనివిగా ఈసీ పేర్కొంది.
Also Read: నోరు జారుడు రాజకీయం.. నేతలూ జాగ్రత్త .. జనం చూస్తున్నారు!
ప్రాథమికంగా చూస్తే, వీరి వ్యాఖ్యలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని, ఎన్నికల ప్రచార సమయంలో గౌరవాన్ని కాపాడుకోవాలని రాజకీయ పార్టీలకు ఇచ్చిన సలహాను ఉల్లంఘించాయని కమిషన్ పేర్కొంది. వీరిద్దరూ మార్చి 29 సాయంత్రంలోగా షోకాజ్ నోటీసులపై స్పందించాలని ఈసీ ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఫిర్యాదు చేసిన ఒక రోజు తర్వాత ఘోష్కు నోటీసు వచ్చింది.
బర్ధమాన్-దుర్గాపూర్ లోక్సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థి ఘోష్, బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని ఎగతాళి చేశారు.
సినీ నటి, బీజేపీ మండి లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్పై సుప్రియా శ్రీనాట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ అది తను చేయలేదని సుప్రియా శ్రీనాట్ ఫైర్ అయ్యారు. తన సోషల్ మీడియా ఖాతాకు యాక్సెస్ ఉన్న వ్యక్తి ఈ పోస్ట్ చేశారని కాంగ్రెస్ నాయకురాలు తర్వాత స్పష్టం చేశారు.
కాగా బుధవారం బీజేపీ అధిష్టానం దిలీప్ ఘోష్ మాటలపై వివరణ కోరింది. దీంతో ఘోష్ క్షమాపణ కోరారు.