Software Engineer Murder: భార్యభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ వ్యవహారం కాస్త మహిళ తల్లిదండ్రుల వరకు వెళ్లింది. రంగంలోకి దిగినవాళ్లు, అల్లుడ్ని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కలకలం రేపిన ఈ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఢిల్లీ ఔటర్లోని లక్ష్మీ పార్కు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వినయ్గుప్తా. ఆయన వయస్సు 31 ఏళ్లు. నోయిడాలోని ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. మూడున్నర సంవత్సరాల కిందట వినయ్కు.. బుధ్ విహార్ ప్రాంతానికి చెందిన రేఖ అనే యువతితో వివాహం జరిగింది. వినయ్-రేఖ దంపతులకు దాదాపు నాలుగున్నర నెలల వయస్సు గల కవల పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు అబ్బాయి కాగా, మరొకరు అమ్మాయి. వినయ్ భార్య గృహణి.
సాఫీగా సాగుతున్న వినయ్ సంసారంలో చిన్నపాటి కలతలు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం దంపతుల మధ్య చిన్నపాటి వివాదం తలెత్తింది. దీంతో రేఖ తన పుట్టింటికి ఫోను చేసి తమవాళ్లను ఇంటికి పిలిపించింది. రేఖ తండ్రి జ్ఞాన్ చంద్, సోదరులు రాజ్కుమార్, సోను, ఆమె సోదరుల్లో ఒకరి భార్య, మరో ఇద్దరు సహచరులు అక్కడికి చేరుకున్నారు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ మొదటి అంతస్తులోని పడక గదిలో వినయ్పై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో వినయ్ తండ్రి- సోదరి పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఇంట్లో వినయ్ తల్లి మాత్రమే ఉంది.
గదిలో వినయ్ అరుపులు విన్న అతడి తల్లి పరుగెత్తుకెళ్లి కొడుకుని కాపాడటానికి ప్రయత్నించింది. అప్పటికే గదిలో బంధించి కొట్టడం కొనసాగించారని చెప్పుకొచ్చారు పోలీసులు. తీవ్రంగా కొట్టడంతో రక్తస్రావమైంది, వినయ్ స్పృహ కోల్పోయాడు. తన కొడుకును కాపాడలేకపోయిన వినయ్ తల్లి సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించింది. అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకోవడం మొదలుపెట్టారు. దీంతో దాడి చేసినవారంతా వచ్చిన కారును అక్కడే వదిలేసి పారిపోయారు. స్థానికులు వారిని వెంబడించి నలుగుర్ని పట్టుకున్నారు. ఇద్దరు మాత్రం ఎస్కేప్ అయ్యారు.
ALSO READ: కారు బోల్తా.. మద్యం కోసం ఎగబడిన జనం, ఇంతకీ ఎక్కడో తెలుసా? వీడియో వైరల్
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. దెబ్బల కారణంగా వినయ్ లేవలేని పరిస్థితి నెలకొంది. ఇరుగు పొరుగు యువకులు మొదటి అంతస్తు నుంచి వినయ్ని కిందకి దించి ఆసుపత్రికి తరలించాడు. అతడి పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనలో మృతుడి భార్యతోపాటు ఆరుగురు నుంచి ఏడుగురు పాల్గొన్నారని వినయ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలను సేకరించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు.