Kavitha Campaign: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీతో అడుగుపెట్టిన ఆపార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత రాష్ట్రవ్యాప్తంగా సొంత కేడర్ను సమాయత్తం చేసేందుకు సరికొత్త రాజకీయ వ్యూహానికి సమగ్ర కార్యాచరణ రూపొందించారు. “సామాజిక న్యాయ తెలంగాణ” సాధన ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు పార్టీ వ్యూహరచన చేస్తోంది.
నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలకు ప్లాన్..
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉన్నప్పటికీ కవిత.. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు అన్ని కులసంఘాలతో భేటీలు, కార్మికులు, ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలతోనూ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. యువతతోనూ సమావేశమవుతూనే.. సోషల్ మీడియా వేదిక చేసుకొని మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సామాజిక న్యాయం జరుగలేదని, వ్యాత్యాసం కొనసాగుతూనే ఉందని ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత మరింత ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రతి ఊరికి సామాజిక న్యాయ తెలంగాణ సంకల్పాన్ని తీసుకెళ్లాలని పార్టీ కేడర్ కు సైతం కవిత దిశానిర్దేశం చేశారు. సామాజిక న్యాయ తెలంగాణ స్ఫూర్తిని ఇప్పుడు ప్రతి గ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. సమాజంలో అత్యధిక జనాభా ఉన్న వాళ్లు అట్టడుగున బతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర భారత దేశంలో ఇప్పటికీ సమానత్వం ఎందుకు అందని ద్రాక్షగా మారిందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, ఇదే అంశాన్ని మీడియా, సోషల్ మీడియా వేదికగా వివరించాలని పార్టీ కేడర్ కు ఆదేశాలు ఇచ్చారు.
అన్ని జిల్లాల్లో సభలు.. కవిత హాజరు!
రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో విధిగా జిల్లా స్థాయి సభలను ఏర్పాటు చేసేందుకు పార్టీ అధినేత కవిత రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఈ సభలన్నింటిలోనూ కవిత స్వయంగా పాల్గొని ప్రసంగించనున్నారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, ప్రతి ఉమ్మడి జిల్లా పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీల్లోనూ సభలు నిర్వహించేలా విస్తృత స్థాయి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే కవిత సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం కోరుట్లలో తొలి సభ నిర్వహించిన విషయం తెలిసిందే.
సీనియర్లకు కీలక బాధ్యతలు..
సామాజిక న్యాయతెలంగాణ సాధన కోసం ప్రజాచైతన్యం చేసేందుకు కవిత సిద్ధమైంది.అందుకు ప్రతి జిల్లాలో మొదటి దశలో అన్ని మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత రెండో దశలో ప్రతి గ్రామంలో సభలు నిర్వహించనున్నారు. సాధించుకున్న భౌగోళిక తెలంగాణను సబ్బండ వర్గాల అభివృద్ధి, వికాసం, సాధికారత సాధించిన తెలంగాణగా సుసంపన్నం లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తరహాలో మళ్లీ ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు పార్టీ కేడర్ ను సమాయత్తం చేసేందుకే సభలు, సమావేశాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సభల నిర్వహణ, పార్టీ సంస్థాగత బలోపేతాన్ని వేగవంతం చేసేందుకు గాను ఒక్కో ఉమ్మడి జిల్లా బాధ్యతలను పార్టీలోని అత్యంత కీలకమైన సీనియర్ నాయకులకు అప్పగించనున్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి కేడర్ను ఏకం చేస్తూ సభలను విజయవంతం చేసే పనిని సీనియర్లకు అప్పగించబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేందుకు పార్టీ త్వరలోనే షెడ్యూల్ కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం.
విద్యావంతులు,మేధావులతో భేటీలు
బహిరంగ సభలతో పాటు సామాజిక వర్గాల సమస్యలు, తెలంగాణలోని ప్రస్తుత స్థితిగతులపై మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు, విశ్రాంత అధికారులతో ప్రత్యేకంగా భేటీలు కానున్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశం.
31న సొంత జిల్లాలో ‘పాంచజన్య సంకల్ప సభ’
తెలంగాణ రక్షణ సేన పార్టీస్థాపించిన తర్వాత కవిత తొలిసారిగా తన సొంత జిల్లా నిజామాబాద్లో పర్యటించబోతున్నారు. ఈ నెల 31న నిజామాబాద్లో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించబోతున్నారు. 15వేల మందితో ఈ సభను నిర్వహించితన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అందుకు జిల్లాలోని కలెక్టరేట్ భవన సమీపంలోనే సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పార్టీ నేతల కు సైతం సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అందుకు ఏర్పాట్లు, సభ విజయవంతంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది.
కామారెడ్డి వేదికగా ముగింపు సభ?
రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో సభలు, మేధావుల భేటీలు పూర్తయిన తర్వాత.. ఈ మొత్తం కార్యక్రమాల ముగింపు సభను కామారెడ్డిలో నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కామారెడ్డి వేదికగానే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్లలో బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ అమలు చేయలేదని, బడ్జెట్ కేటాయించలేదని విమర్శలు గుప్పించనున్నారు. బీసీలను మోసం చేసిందని ఎత్తిచూపనున్నట్లు సమాచారం. అందుకే కామారెడ్డిలో ముగింపు సభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభల ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కీలక శక్తిగా ఎదిగేందుకు కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
Also Read: తెలంగాణ విద్యార్థుల కోసం ధర్నా చేసే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి KTR సవాల్!