Air India : ఎయిర్ ఇండియాకు అసలేమైంది? అవి విమానాలా.. మృత్యు విహంగాలా? డొక్కు బస్సుల కంటే కూడా దారుణంగా తయారయ్యాయి డ్రీమ్ లైనర్లు. అన్నీ ప్రాబ్లమ్సే. ఫ్లైట్లో ఏసీలు పనిచేయకపోవడం.. టచ్ స్క్రీన్లు తుస్సు మనడం.. ఛైర్లు సరిగ్గా లేకపోవడం.. ఫుడ్ ప్రాబ్లమ్స్ లాంటివే ఇన్నాళ్లూ చూశాం. లేటెస్ట్గా అంతకుమించి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా డ్రీన్ లైనర్ విమానం కుప్పకూలడంతో వాటి భద్రతపై అనేక ప్రశ్నలు, అనుమానాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టే.. వరుస ఘటనలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. ఇంజిన్లు ఆగిపోవడం.. సర్వీసులు సడెన్గా నిలిచిపోవడం.. కలవర పెడుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. గడచిన 48 గంటల్లో.. వివిధ సాంకేతిక కారణాలతో ఏకంగా 9 ఎయిరిండియా విమానాలు రద్దు అయ్యాయంటే నమ్మాల్సిందే.
DGCA సీరియస్ వార్నింగ్తో ఎయిరిండియా తన బోయింగ్ విమానాల్లో తనిఖీలు చేపట్టింది. అలా రెండు రోజుల్లో 9 విమానాల్లో టెక్నికల్ ఇష్యూస్ గుర్తించింది. ఆ సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేయడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పారిస్ ఫ్లైట్ క్యాన్సిల్
లేటెస్ట్గా ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 143 ను క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ముందస్తు విమాన తనిఖీల్లో సమస్యను గుర్తించినట్టు తెలిపింది. AI 143 రద్దుతో పారిస్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిర్ ఇండియా AI 142ను కూడా తాత్కాలికంగా రద్దు అయింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది.
లండన్ సర్వీస్ రద్దు..
అటు.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానాన్ని రద్దు చేశారు అధికారులు. గతవారం ఇదే సర్వీసు విమానం కూలిపోయి ఘోర విషాదాన్ని మిగిల్చిన ఘటన మరవక ముందే మరో విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో ప్యాసింజర్లు వణికిపోతున్నారు. టేకాఫ్కు ముందే సమస్యను గుర్తించడంతో ఈ సర్వీసును రద్దు చేశారు.
ఎయిరిండియా ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరాల్సి ఉంది. ఈ క్రమంలో విమానంలో తనిఖీలు చేస్తుండగా.. సాంకేతిక సమస్యను గుర్తించారు. వెంటనే టేకాఫ్ నిలిపివేసి సర్వీసును రద్దు చేశారు. గత వారం నాటి విమాన ప్రమాదం తర్వాత లండన్కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్డ్ విమానం ఇదే కావడంతో అధికారులో టెన్షన్ నెలకొంది. అకస్మాత్తుగా విమానం రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. టికెట్ చార్జీలు రిటర్న్ చెల్లిస్తామని ఎయిర్ఇండియా తెలిపింది.
Also Read : విమానం కూలిన చోట 70 తులాల బంగారం, నగదు.. ఏం చేశారంటే..
డీజీసీఏ హెచ్చరికతో పక్కాగా తనిఖీలు చేస్తున్నారు కాబట్టి సమస్యలు బయటపడుతున్నాయి.. లేదంటే.. అలానే విమానం గాల్లో ఎగిరితే.. ఎంత ప్రమాదం జరిగి ఉండేదని మండిపడుతున్నారు. ఎయిర్ఇండియా ఎక్కితే.. ఇక ప్రాణాలు గాల్లోకే అంటూ డ్రీమ్ లైనర్ల భయం మొదలైంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారు క్యాన్సిల్ చేసేస్తున్నారు.