Heavy Temperatures and Heat Waves in India : భారత్ లోని అనేక రాష్ట్రాల్లో ఆదివారం (మే 5) ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ ను దాటాయి. ఉక్కపోత, తీవ్రవడగాల్పులు, వడగాల్పులతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. డీహైడ్రేషన్ కు గురై నీరసించిపోతున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రలోని రాయలసీమ, మహారాష్ట్రలోని విదర్భ, ఉత్తర అంతర్గత కర్ణాటక, ఉత్తర మధ్యప్రదేశ్ లో 44-45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో వేడి అధికంగా కనిపించింది.
అలాగే.. మరాఠ్వాడా, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, కోస్తాంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
గంగానది పరివాహక ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. అదేవిధంగా.. ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడులోని ప్రధాన ప్రాంతాలు.. కేరళ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే 2-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. మనిషి ఆరోగ్యం, వ్యవసాయ ఉత్పత్తులపై ఈ ఉష్ణోగ్రతలు ప్రభావం చూపిస్తున్నాయి.
Also Read : వేడి వాతావరణంలో చల్లటి కబురు.. ఎల్లుండి నుంచి వర్షాలు
ఈ ఉష్ణోగ్రతలు గ్లోబల్ హీట్ వేవ్ ల పెరుగుదలను సూచిస్తున్నాయి. అలాగే నీటి కొరతకు కూడా కారణం కావొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 10వ తేదీ వరకూ ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని పేర్కొంది. అధిక ఎండలకు తోడు.. తీవ్రమైన వడగాల్పులు కూడా వీస్తున్న క్రమంలో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను తాకాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వేడి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో.. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వర్షాకాలం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రోహిణి కార్తె వస్తే ఇంకెలా ఉంటుందోనని భయపడుతున్నారు. రోహిణి కార్తెకు రోళ్లుపగిలే ఎండలు కాస్తాయన్నది నానుడి. ఇప్పుడే మాడు పగిలే ఎండలుంటే.. ముందు ముందు ఎండలు ఇంకెలా ఉంటాయోనని జంకుతున్నారు.