Amazon OTT: ఈ మధ్యకాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ వినియోగదారులను ఆర్థికంగా బాగా ఇబ్బందులు పెడుతున్నాయనే కామెంట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ పేరిట నెలవారీ లేదా ఏడాదికి సబ్ స్క్రిప్షన్ తీసుకున్నప్పటికీ కూడా స్ట్రీమింగ్ మధ్యలో వాణిజ్య ప్రకటనలను ప్రసారం చేయడం వల్ల వినియోగదారుడికి సినిమా లేదా వెబ్ సిరీస్ చూసే ఆసక్తిని దెబ్బతీస్తున్నాయి. అంతేకాదు ప్రకటనలను లేకుండా స్ట్రీమింగ్ చేయాలి అంటే అదనపు రుసుము చెల్లించాలి అనే కొత్త రూల్స్ తీసుకురావడం వినియోగదారుడుకి మరింత ఆర్థికంగా ఇబ్బందులు కలిగిస్తోంది.
ఇలాంటి నేపథ్యంలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారంగా గుర్తింపు తెచ్చుకున్న అమెజాన్ ప్రైమ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు .ఎన్నో భిన్న విభిన్నమైన జానర్లలో ఇటు సినిమాలు అటు ఒరిజినల్ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందిస్తూ ఎంటర్టైన్మెంట్ అందించడంలో దూసుకుపోతోంది. అలాంటి అమెజాన్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ప్రైమ్ వీడియోలో సినిమా లేదా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మధ్యలో వాణిజ్య ప్రకటనలను ప్రవేశపెట్టడం.. ఆ ప్రకటనలు రాకుండా ఉండాలి అంటే వినియోగదారుల నుంచి అదనపు రుసుము వసూలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం.. దీనిని ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ సీరియస్ గా తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఫెడరల్ కోర్టులో అమెజాన్ పై దావా కూడా వేసింది . వార్షిక ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఒప్పందాలలో అమెజాన్ ఏకపక్ష నిబంధనలను పొందుపరిచిందని , వినియోగదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే సేవలలో భారీ మార్పులు చేసింది అని ఏసీసీసీ ఆరోపించింది. ముఖ్యంగా ఈ మార్పుల వల్ల నవంబర్ 2023 నుండి ఆగస్టు 2025 మధ్యకాలంలో ఆస్ట్రేలియాలో దాదాపు 15 లక్షల మంది సబ్స్క్రైబర్లు అమెజాన్ రూల్స్ కి ప్రభావితం అయ్యారు అని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియాలో 2024 నుంచి ప్రైమ్ వీడియోలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అమెజాన్ ప్రకటనలను ప్రారంభించింది. దీంతో అప్పటికే ఏడాది మొత్తానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్న 8.5 లక్షల మంది చందాదారులు ప్రకటనలతో కూడిన వీడియోలను చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా అలా ప్రకటన లేకుండా వీడియోలను చూడాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తో పాటు అదనంగా డబ్బులు చెల్లించాలని నిబంధనలు కూడా పెట్టింది.
ALSO READ:వివాదాల్లో ఇరుక్కొని ఈ యంగ్ హీరోలు కెరియర్ పాడు చేసుకుంటున్నారా?
అలా వినియోగదారుడికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల ముందస్తుగా పూర్తి రుసుము చెల్లించిన వినియోగదారులను అన్యాయం చేయడమే అంటూ ఏసీసీసీ కోర్టుకు వివరణ ఇచ్చింది. అంతేకాదు ఈ వ్యవహారంపై అమెజాన్ వెంటనే వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలి అని న్యాయస్థానాన్ని కూడా కోరింది. దీంతో ఈ కేసును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని దర్యాప్తుకు సహకరిస్తామని అటు అమెజాన్ ప్రతినిధులలో ఒకరు తెలిపారు. మరి కోర్ట్ ఆదేశాల మేరకు అమెజాన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం తెలియాల్సి ఉంది.