Malayalam Crime Thriller: ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి… ప్రశాంతమైన కుటుంబ జీవితం… ఎలాంటి సమస్యలు లేని రొటీన్ లైఫ్. కానీ ఒక రోజు అతను చూడకూడని ఓ సంఘటనను చూడటంతో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఏకంగా రూ.17 కోట్ల బ్యాంకు దోపిడీ కేసులో అతని పేరు వినిపిస్తుంది. తాను చేయని నేరానికి నిందితుడిగా మారి, పోలీసుల నుంచి, అసలు నేరస్థుల నుంచి తప్పించుకుంటూ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తే ? ఇదే ఆసక్తికరమైన కాన్సెప్ట్తో తెరకెక్కిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ (I Nobody). మరి రాజీవన్ ఈ కేసులోకి ఎలా వచ్చాడు ? అసలు దొంగలు ఎవరు ? చివరికి అతను తనను తాను ఎలా కాపాడుకున్నాడు ? అనే విషయం తెలుసుకుందాం.
రాజీవన్ ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. భార్య, పిల్లలతో కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. ఆఫీస్, ఇల్లు, కుటుంబం… ఇదే అతని ప్రపంచం. క్రైమ్తో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిలా కనిపించే రాజీవన్ జీవితంలో ఓ రోజు అనుకోని సంఘటన జరుగుతుంది. అతను చూడకూడని ఓ విషయాన్ని చూడటంతో అసలు సమస్య మొదలవుతుంది. అదే సమయంలో సుమారు రూ.17 కోట్ల భారీ బ్యాంకు దోపిడీ జరుగుతుంది. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభిస్తారు. అయితే పరిస్థితులు క్రమంగా రాజీవన్కు వ్యతిరేకంగా మారతాయి. తాను చేయని నేరానికి అతనిపై అనుమానాలు మొదలవుతాయి. ఒక సాధారణ ఉద్యోగి ఒక్కసారిగా పోలీసుల టార్గెట్గా మారిపోతాడు.
కానీ సమస్య అక్కడితో ఆగదు. పోలీసులు అతన్ని వెతుకుతుంటే, మరోవైపు అసలు నేరస్థులు కూడా రాజీవన్ వెంట పడతారు. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కాకపోయినా, తన భార్య, పిల్లలకు ప్రమాదం ఉందని గ్రహించిన రాజీవన్ వారి కోసం పోరాటం మొదలుపెడతాడు. ఇక అసలు మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది. తనపై పడిన నేరాన్ని తొలగించుకోవడంతో పాటు కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన రాజీవన్, చివరికి పోలీసులనే తప్పించుకునే పరిస్థితికి వస్తాడు. అయితే నిజం బయట పెట్టాలంటే అతను ఎదుర్కోవాల్సింది కేవలం నేరస్థులను కాదు… తనను నమ్మని వ్యవస్థను కూడా.
ఇంతకీ హీరో దొంగతనం చేశాడా ? ప్రభుత్వ ఉద్యోగి ముసుగులో ఉన్న అతను ఎవరు ? రాజీవన్ నిజంగానే అమాయకుడా? అతను చూసిన సంఘటనకు రూ.17 కోట్ల దోపిడీకి సంబంధం ఏంటి? దొంగలు అతన్ని ఎందుకు వదలడం లేదు? బ్యాంకు నుంచి దోచుకున్న డబ్బు ఎక్కడికి వెళ్లింది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
సాధారణ హీస్ట్ సినిమాల్లో దోపిడీ ఎలా జరిగింది, దొంగలు ఎలా తప్పించుకున్నారు అనే అంశాలపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ ఇందులో మాత్రం ఓ సామాన్యుడు అనుకోకుండా క్రైమ్ కేసులో ఇరుక్కుని, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటాన్ని ప్రధానంగా చూపించారు. బ్యాంక్ రాబరీ, ఇన్వెస్టిగేషన్, సర్వైవల్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసిన ఈ సినిమా సుమారు 2 గంటల 49 నిమిషాల నిడివితో సాగుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ రాజీవన్ పాత్రలో నటించగా, పార్వతి తిరువోతు కీలక పాత్రలో కనిపించారు. హక్కీమ్ షాజహాన్, అశోకన్, విజయరాఘవన్, మధుపాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిసామ్ బషీర్ దర్శకత్వం వహించారు. 2026 జూలై 9న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆగస్టు 25 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. గుడ్ న్యూస్ ఏంటంటే మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది.
Read Also: సరస్సు దగ్గర దొరికిన డబ్బు బ్యాగ్… కట్ చేస్తే జాంబీ ప్రపంచంలో… తెలుగులోనే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్