బండి సంజయ్ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. కొడుకు కేసు తరువాత తెర వెనుకే ఉండిపోయాడు. చాలా విషయాల్లో స్పందించలేదు. మౌనాన్నే ఆశ్రయించాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ టూర్ తరువాత అల్లకల్లోలంగా ఉన్న బండి రాజకీయ భవితవ్యంపై చాలా క్లారిటీ వచ్చింది. కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే ఊహాగానాల నేపథ్యంలో.. తెలంగాణ నుంచి కొత్త వారికి ఛాన్స్ రానుందనే ప్రచారమూ ఉంది.
ఇందులో ఈటల రాజేందర్, డీకే అరుణకు చాన్స్ ఉండొచ్చనే సమాచారం ఉంది. దీంతో పాటు బండి సంజయ్ పదవి ఉంటుందా? ఊడుతుందా? అనే ప్రచారమూ లైవ్లోనే ఉంచారు. నితిన్ పర్యటన తరువాత క్లారిటీ వచ్చింది బండిలో. మరోవైపు సీఎం రేవంత్ నిన్న రైతు పండుగ కార్యక్రమంలో నితిన్పై కామెంట్ చేశారు. ఆయనవరో ఆయన పేరు నాకు సరిగ్గా తెలియదు.. అని నితిన్ నబీన్ను ఉద్దేశించి కొంచెం వ్యంగ్యం జోడించి మాట్లాడాడు. దీంతో బండి సంజయ్కు ఆగ్రహం వచ్చింది.
బీజేపీ నేతలెవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు. కానీ బండి .. సీఎం రేవంత్పై విరుచుకుపడ్డారు. జాతీయ అధ్యక్షుడి పేరు తెలియదా? నీ పేరు మరిచిపోతున్నారంతా.. ఇక అధికారంలోకి రాబోయేది మా పార్టీనే అన్నారు. నితిన్ పర్యటన తరువాత బీజేపీలో జోష్ వచ్చింది. దీనికి తోడు బండి సంజయ్ ఉత్సాహానికి మరింత ఊతమిచ్చినట్టయ్యింది.
మొదటి నుంచి కేంద్రం నుంచి బండి సంజయ్కు సపోర్టు దొరుకుతున్నది. కొడుకుపై కేసు తరువాత కొంచెం ఆయన రాజకీయ భవితవ్యం నీలినీడలు అలుముకున్నాయనే ప్రచారం చేశారు. కానీ మొదటి నుంచి కేంద్ర పెద్దలు ఈ విషయంలో అభయమిస్తూ వస్తున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై ఓ క్లారిటీ రావడం… ఎవరికి ఉద్వాసన పలుకుతున్నారో, ఎవరికి అవకాశం కల్పిస్తున్నారో తెలంగాణ పార్టీ నేతలకు ఓ క్లారిటీ వచ్చేసింది.
ఇందులో బండి సేఫ్ అనే విషయం కూడా అందిరికీ తెలిసింది. దీంతో బండిలో మళ్లీ పాత ఉత్తేజం కనిపిస్తోంది. దీనికి రేవంత్ కామెంట్లు కూడా తోడయ్యాయి. అందుకే మళ్లీ బండి పికప్ అందుకున్నట్టుగా కనిపిస్తోంది. నితిన్ నబీన్ పర్యటన కూడా సక్సెసయ్యిందనే చెప్పాలి. ఆయన ఫక్తు రాజకీయ కామెంట్లు కాకుండా.. పార్టీ పరమైన విధానాన్ని చెబుతూనే.. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకుని మాట్లాడారు. తమకూ ఓ ఛాన్సు ఇవ్వండని ప్రజలను అప్పీలు చేసుకునే విధానం ఆకట్టుకున్నది.
కిషన్రెడ్డి, రఘునందన్రావు, పార్టీ అధ్యక్షుడు రాంచంద్రారావు, ఈటల, అర్వింద్.. వీళ్లంతా ఒకెత్తయితే.. బండి వీరికంటే ప్రత్యేకంగా ఉంటున్నారనే విషయం అధిష్టానం గుర్తించింది. అతని అధ్యక్షతన పార్టీ బలం పుంజుకున్న విషయాన్ని కూడా గమనంలోకి తీసుకున్నది. అందుకే బండి ఉత్సాహానికి బ్రేకులు వేయాలని అధిష్టానం భావించడం లేదు. ఇక మళ్లీ కేటీఆర్ అండ్ టీమ్ బండిపై దాడిని ఇక షురూ చేసేందుకు కత్తులు నూరుతున్నారు.