ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం.. ! చిన్నప్పుడు సరదాగా ఆడుకున్న ఆట ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు దీన్ని ఎన్నెన్నిసార్లు ఇంకెన్నిసార్లు అని మార్చుకోవాలి. అడగాలి. ఇంకెన్నిసార్లు పెంచుతర్రా బై… అని! కానీ అక్కడ్నుంచి సమాధానం రాదు. తెల్లారిలేవగానే ఓ చావు కబురులాంటి పెట్రోల్ వాసన కంపు కొడుతూ ఓ మెస్సేజ్ వస్తుంది. ఇవాళ పెరిగిన పెట్రోల్ ధరలు ఇవీ. ఈ ఉదయం నుంచే అవి అమల్లోకి వస్తాయని. బంగారం ధరల్లా రోజుకు ఎంత పెరుగుతుంది? ఎంత తక్కువవుతుంది? లాగా.. ఈ పెట్రోల్, డీజీల్ ధరలు నిత్యపెరుగుదల మీద కూడా పొద్దున్నే ఓ ప్రత్యేక వార్తా బులిటెన్ నడపాలి కాబోలు.
అక్కడ బంగారు అప్పుడప్పుడు తగ్గే అవకాశం ఉందండోయ్.. ఇక్కడ చస్తే కూడా తగ్గే అవకాశం లేదు. ఒకే ఒక అవకాశం ఉంది. అదీ పొదుపుగా మరీ పొదుపుగా బతకాలె అనే మెసేజ్. బతికేలా చేసే పరిస్థితి. ఎంతెంతంగా పెట్రోల్ ధర పెరుగుతూ పోతే.. మనం అంతంతగా పొదుపు చర్యలు పాటిస్తూ పోవాలన్నమాట. నేర్చుకోవాలన్నమాట. అలవాటుపడాలన్నమాట. మరి ఇంకా ఇంకా పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతే..! పోతే…. పొదుపు చర్యల నుంచి పీనాసి వేశాలు వేసే దాకా ఎదగాలన్నమాట. పీనాసి వేశాలంటే..? అదే.. అహనా పెళ్లంట సినిమాలో.. కోటగాడు పాటించే పొదుపు చర్యలనబడే పిసినిగొట్టు చర్యలు. అర్థం కాకపోతే ఆ సనిమాను మళ్లీ మళ్లీ చూడొచ్చు.
ఇంకా ఇంకా పెరిగితే.. ! అప్పుడు ఆ పీనాసిగొట్టు వెధవ కోటగాడికే పాఠాలు నేర్పించే పాత్ర ఉంటుంది కదా..! అదే రాజేంద్రప్రసాద్ పాత్ర. అతనితో శబ్బాష్ అనిపించుకునేందుకు తను పీనాసీ సంఘానికే ప్రెసిడెంట్ అయినట్టు..కోటగాడికి కొత్త పాఠాలు నేర్పుతూ పిసినారితనంలో ఎప్పడూ ఎవరూ చూడని కొత్త కోణాలను చూపిస్తాడు చూడు. అవి చూడండి. బట్టలకు బదులు పాత కాగితపు పేపర్లు చుట్టుకోవడం, పాడేసిన అగ్గిపుల్లలు, చెత్త చెదారంతో చారు కాచుకోవడం, రాత్రిళ్లూ ఎవరి కంటా పడకుండా దొంగతనాలు చేయడం లేదా.. బస్టాండ్లలో కాఫీలు, టీలు అమ్ముకోవడం.. ఇంకా చాలా చాలానే ఉంటాయి. అయిడాలు.. అదర్సు అనుకో. అవి గనుక నేర్చుకున్నామంటే.. ఇలా రోజుకు రేట్లు ఎన్ని పెరిగినా మనల్నేం పీకలేవన్నమాట.
అవునూ.. మోడీ పొదుపు మంత్రం వెనుక ఉన్న పరమార్థం ఇదేనా? అన్నీ తగ్గించుకోండి..! ముందుందు రోజులు ఘోరంగా ఉంటాయి.. అంటే ఇదేనా? మరి ఒక్కసారిగా ఓ పది.. ఇరవై రూపాయలు పెంచేసి మన మానాన మనల్ని వదలిస్తే అయిపోవుగా. రోజూ ఇలా చంపాలా? అక్కడే ఉంది కిటుకు. కొంచెం కొంచెంగా.. అలా అలా పెంచుతూ… పెంచుతూ పోతాడన్నమాట. మనకు కూడా రోజు ఇది అలవాటైపోతుంది. ఏ రెండు రూపాయలే కదా? అని రోజూ అనుకుంటూనే ఉంటాం. చివరకు అది అలవాటైపోతుంది. మనం ఇక పెరిగిన పెట్రల్ ధరలు ఎంతో తెలుసుకోవడం కూడా మరిచిపోతామన్నమాట.
బ్రిటీషోడు.. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నవారిని అరెస్టు చేసి చిప్పకూడు తినిపించేవాడట. అల్యూమినియం పాత్రలో వండిన వంట తినిపించేవాడట. ఆ పాత్రల్లో ఉండే విషం మెల్ల మెల్లగా శరీరంలో చేరి చివరకు కొంతకాలానికి చచ్చేవారట. అలా ఆ బ్రిటీషోడి సూత్రాలే పాటిస్తున్నాడు మన మోడీ. మెల్ల మెల్లగా అలవాటు చేసి.. ఆపై అదే అలవాటుగా మారిపోయి.. పీనాసి పాత్రలో మనం జీవించేయడం పరిపాటిగా మారిపోయి.. బతుకే నిస్సారంగా మారిపోయి.. జీవితమే దుర్బరమైపోయి… దేశం కోసం .. ధర్మం కోసం అంటూ మైమరిచిపోయి… జీవచ్చవాళ్లా జవజీవాలుడిగిపోయి…! కారణజన్ముడైన మోడీకి జేజేలు పలుకుతూ శేషజీవితం గడపేయాలలా!