బంగాళఖాతంలో పడేస్తాం..! ఇది రేవంత్రెడ్డి మార్కు ఫేమస్ డైలాగ్. అధికారంలోకి రాకముందు.. పీసీసీ చీఫ్గా ఆయన ధరణిపై తనదైన స్టైల్లో చేసే ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. ధరణి ముచ్చట రాగానే రేవంత్.. బంగాళాఖాతంలో పడేస్తాం అని జోడించి.. దీని వల్ల రైతులు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో తెలియజేసేవారు. కేసీఆర్కు ఈ వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేవి. ఆయన మానసపుత్రిక ధరణి. అలాంటి ధరణినే బంగాళాఖాతంలో పడేస్తాడా? అని ఆయన కూడా వేదికల మీద ఘటుగానే స్పందించేవాడు.
మన ధరణి యాప్నే బంగాళాఖాతంలో పడేస్తానన్న కాంగ్రెస్ను బంగాళాఖాతంలో పడేయాలని ఆయన పిలుపునిచ్చేవారు. అంతిమంగా బీఆరెస్ను బంగాళఖాతంలో పడేశారు జనాలు. కేసీఆర్ను ఫామ్హౌజ్కు పరిమితం చేశారు. ఇప్పుడు ఇది కాదు ముచ్చట. కొత్తగా కేటీఆర్ కూడా ఈ బంగాళఖాతం ముచ్చట అందుకున్నాడు. యూరియా యాప్తో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్న కేటీఆర్.. తాము అధికారంలోకి రాగానే మొదట చేసే పని .. యూరియా యాప్ను బంగాళాఖాతంలో పడేయడమేనని హామీ ఇచ్చారు.
ప్రతిపక్షంలో రేవంత్ నోట వచ్చిన ఈ బంగాళఖాతంలో పడేస్తామనే మాస్ డైలాగ్ జనాలకు ఎంత కనెక్టయ్యిందో.. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే స్టైల్లో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి రైతులు ఈ యూరియా యాప్తో బాగా ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ బద్నాం అవుతున్న మాట కూడా వాస్తవమే. కానీ దీనిపై ఏమీ చేయలేని నిస్సహాయత సర్కార్లో ఉంది. రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని, వాటిని నివారించేందుకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఇది ప్రతిపక్షానికి ఓ ప్రధాన అస్త్రంగా కూడా మారింది.
నల్లగొండ పర్యటనలో కవిత.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి తన గన్మెన్ పేరుతో రెండు లారీల యూరియాను బ్లాక్ చేశారని ఆమె ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలను కూడా ఈ యాప్ మూటగట్టుకుంది. అంతిమంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. యూరియా యాప్ను రూపొందించడంలో సర్కార్ ఉద్దేశ్యం.. గతంలో మాదిరిగా.. చెప్పులు లైన్లలో పెట్టే దీన పరిస్థితులు పునరావృతం కాకూడదని.
కానీ ఈ యాప్ ఉద్దేశ్యం సరిగా అమలు కాలేదు. అందరి వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో.. ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు.. పనంతా మానుకొని, వారు చెప్పిన సమయానికి ఇలా బటన్ నొక్కేందుకు రెడీగా ఉండాలి. క్షణం ఆలస్యమైనా ఆ స్టాక్ అయిపోతుంది. దీంతో నిత్యం దీనితో నరకయాతన పడ్డారు రైతులు.
ఒక్కరు కూడా మెచ్చుకుని ఈ యూరియా యాప్ను సర్కార్ మరి ఎందుకు కంటిన్యూ చేస్తున్నట్టో..? అందుకే దీన్ని ప్రతిపక్షం ఓ అస్త్రంగా తీసుకున్నది. ఇప్పుడు ఏకంగా తన సభలలో దీన్నే ప్రధాన విమర్శగా తీసుకుంటున్నాడు కేటీఆర్. రైతులకు మరింత చేరువగా పోయేందుకు.. తమను మంచి మెజారిటీ గెలిపించాలని, ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆరెస్కే ఓటేయాలని, అధికారంలోకి రాగానే యూరియా యాప్ను బంగాళాఖాతంలో పడేస్తామని వారికి కనెక్టయ్యేలా చెబుతూ వస్తున్నాడు కేటీఆర్…!