మాజీ స్పీకర్, మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిపై కేటీఆర్ పగబట్టాడు. బీఆరెస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేలలో అందరికన్నా కోపం.. పోచారం పైనే ఉంది కేటీఆర్కు. ఎందుకంటే ఆయనకు కేసీఆర్ అంతలా ప్రయార్టీ ఇచ్చాడు కాబట్టి. నిధులు ఎక్కువ మొత్తంలో పట్టుకుపోవడంతో పాటు… ఓ సారి మంత్రిగా, మరోసారి స్పీకర్గా అతనికి అవకాశం ఇవ్వడంతో పాటు పోచారం కొడుకు భాస్కర్రెడ్డికి డీసీసీబీ చైర్మన్గా కూడా అవకాశం కల్పించాడు.
ఇంత చేసినా.. సర్కార్ ఓడిన మరుక్షణం రేవంత్ పంచన చేరడాన్ని కేసీఆర్ పెద్దగా పట్టించుకోకపోయినా.. కేటీఆర్ మాత్రం అగ్గిమీద గుగ్గిలమవుతున్నాడు. పోచారం శ్రీనివాస్రెడ్డి పార్టీ మారిన తరువాత.. బాన్సువాడలో బీఆరెస్ అనాథలా మారింది. అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులే తప్ప.. పెద్ద నాయకులు కరువయ్యారు. ఉన్నవాళ్లను పోచారం తనవెంట తీసుకెళ్లాడు.
ఒక్కసారి ఓడితే .. అప్పటి దాకా ఉన్న పరువు, ప్రతిష్ట మొత్తం గంగలో కలపాడనే ఆగ్రహం పీకల్లోతు ఉంది కేటీఆర్కు. అందుకే బాన్సువాడకు రెండు, మూడు సార్లు తన ప్రోగ్రామ్లను కావాలని పెట్టించుకున్నాడు కేటీఆర్. అక్కడే బాన్సువాడ చౌరస్తాలో రోడ్ షోలు నిర్వహిస్తూ… పెద్ద మనిషి అని గౌరవించినట్టే ఇస్తూ.. ఇంకేం చేయాలి నీకు.. అన్నీ చేశాం కదా.. సిగ్గులేదా పార్టీని వీడి పోవడానికి. ఏదైనా బండ కట్టుకుని బావిలో దూకి చావరాదు..!అని శాపనార్దాలు పెట్టి వస్తున్నాడు.
అయితే ఇక్కడ ఇంచార్జిగా బాజిరెడ్డి గోవర్దన్ను నియమించాడు కేసీఆర్. బాజిరెడ్డికి వాస్తవంగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఇంట్రస్టు కూడా లేదు. ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటు.. తన కొడుకు బాజిరెడ్డి జగన్కు తను పోటీ చేసి ఓడిపోయిన నిజామాబాద్ రూరల్ నుంచి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ను కోరుతూ వస్తున్నాడు. అయితే అక్కడి నుంచి ఎలాంటి సిగ్నల్ ఇంకా రాలేదు. కేసీఆర్ మాట కాదనలేక.. బాజిరెడ్డి అప్పుడప్పుడు అలా వెళ్లి వస్తూ మీటింగులు పెట్టుకుంటున్నాడు. గతంలో బాన్సువాడ నుంచి కూడా ఎమ్మెల్యేగా చేసి అనుభవం బాజిరెడ్డికి ఉన్నది.
అయితే బాజిరెడ్డి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంపై దృష్టిపెట్టకపోవడంతో.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కు చెందిన గులాబీ దండును మొత్తం అక్కడికి దింపి పోచారంను చెడా మడా తిట్టిస్తున్నాడు కేటీఆర్. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు.. అని పదే పదే తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకునే కేటీఆర్.. తను పగబడితే ఎలా ఉంటుందో.. పోచారంను వెంటాడుతున్న వైనాన్ని చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అక్కడ పార్టీ పూర్తిగా పోతే పోయింది గానీ, పోచారం శ్రీనివాస్రెడ్డికి, అతని తనయుడు భాస్కర్రెడ్డికి మాత్రం రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేయాలనేదే కేటీఆర్ ఆలోచనగా ఉంది. ఇప్పుడు పోచారం పరిస్థితి కూడా కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అందులో ఉండలేడు. ఇమడలేడు. కావాల్సిన నిధులు రాబట్టలేడు. మళ్లీ కేసీఆర్ పంచన చేరలేడు. అందులోనే ఉండి కొడుకుకు టికెట్ ఇప్పించుకున్నా.. గెలుస్తామనే నమ్మకమూ లేదు.
ఒక్కసారి తీసుకున్న పార్టీ జంపింగ్ నిర్ణయం.. కేటీఆర్ రూపంలో ఇలా వెంటాడుతున్నది. పెద్ద మనిషిని మనసున పట్టనీయకుండా నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నది.