ఓటరు జాబితా సమగ్ర సవరణ ( సర్)పై తెలంగాణలో రాజకీయ పార్టీలు విపరీతమైన చైతన్యం చాటుతున్నాయి. గతంలో పలు రాష్ట్రాలలో తలెత్తిన ఉపద్రవాలను ఈ సందర్బంగా గుణపాఠాలుగా తీసుకుంటున్నారు. ఎవరికి వారే దీనిపై అలర్టుగా ఉన్నారు. దీని తీవ్రత తెలియక ఇతర రాష్ట్రాల్లో అధికారాన్నే కోల్పోయే స్థితికి రావడం, లక్షల ఓట్లు గల్లంతు కావడం.. ఆందోళన కలిగించే అంశంగా చూస్తున్నారు.
ఈనెల 25 నుంచి తెలంగాణలో అమలయ్యే సర్ విధానం పట్ల ఓ వైపు అప్రమత్తంగా ఉంటూ.. శిక్షణ తరగతులు.. అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుంటూనే.. మరోవైపు కేంద్రంపై పోరాటాలకు కూడా సై అంటున్నారు. అంతిమంగా ఇక్కడ బీజేపీని విలన్గా చూపే ప్రయత్నంలో రాజకీయాలకతీతంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అంతటా ఒక లెక్కా.. తెలంగాణలో ఇంకో లెక్క అన్నట్టుగా ప్రధానమైన రెండు పార్టీలు పోటాపోటీగా సర్ విధానాన్ని ఎదుర్కొనేందుకు రెడీ అయ్యాయి.
అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్ కూడా ఓట్ల గల్లంతు విషయంలో జాగ్రత్తగా ఉంది. కొత్త ఓట్లర్ల నమోదు విషయంలో వారికి ఆందోళన లేదు. ఉన్న ఓట్లు గల్లంతు చేస్తారనే భయమే ఉంది. దీన్ని ఎలా నివారించాలో.. సర్ విధానంలో ఉన్న వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలో, దీని కోసం ఎలా అప్రమత్తంగా ఉండాలో అంతా రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ , బీఆరెస్ బూత్ల వారీగా బీఎల్ఏలను నియమించుకుంటున్నది. ఎవరి ఓటు బ్యాంకు వారు కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యంగా పెట్టుకున్నారు.
మరోవైపు కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు ఇవాళ ఆందోళనకు దిగాయి. ఒక్క నెల రోజుల పాటు చేసే సర్ ప్రక్రియ తమకు సరిపోదని, దీన్ని ఒక ఏడాది పాటు కొనసాగించాలనే డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఇవాళ ఆందోళనకు దిగారు. సర్ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జన సమితి, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ,టి.జె.ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించే అవకాశం ఉన్న ఏ చర్యనైనా ప్రజాస్వామ్య శక్తులు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని కోదండరామ్ పేర్కొన్నారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయడం సాధ్యం కాదని, కనీసం ఒక సంవత్సరం పాటు ఈ ప్రక్రియను కొనసాగిస్తేనే ఓటర్లకు తగిన అవకాశం లభిస్తుందని అన్నారు.
గతంలో ఎస్ఐఆర్ నిర్వహించిన రాష్ట్రాల్లో తగిన సమయం లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా లక్షలాది మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వివిధ కారణాలు చూపుతూ పౌరుల ఓటు హక్కును తొలగించే పరిస్థితులు తలెత్తకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాల పరిమితిని పెంచాలని భావిస్తున్నారు. మరోవైపు అటు బీఎల్ఏలను నియమించుకుంటూ ఆయా పార్టీలు.. క్షేత్రస్థాయిలో తాము చేయాల్సిన బాధ్యతను చేసుకుంటూ పోతున్నాయి. మొత్తానికి కేంద్రం వ్యూహాత్మకంగా విసిరిన ఈ సర్ కు చిక్కకుండా తమ ఓట్లను ఎలా కాపాడుకోవాలనే విషయంలో తెలంగాణ చైతన్యమైందనే చెప్పాలి.