జెన్-జీని పురుగుల్లా చూశారు. మీతో ఏం అవుతుంది? మా మోడీని ఢికొట్టే సత్తా ఎవడికీ లేదు.. అని విర్రవీగారు. దేశం కోసం, ధర్మం కోసం అనే ట్యాగ్లైన్ ఒక్కటి చాలు… మాదే అధికారం.. అంతా మోడీ జపమే చేస్తున్నారన్నారు. కానీ స్వయంగా ఆ మోడీజీనే ఇప్పుడు జెన్-జీ జపం చేస్తున్నాడు. అవును… తత్వం బోధపడింది. దిగరాక తప్పలేదు. నీట్ ప్రశ్నా పత్రాల లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
కాక్రోచ్ జనతా పార్టీకి కూడా జెన్-జీ పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. జెన్-జీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్టు చేసింది. రాహుల్ గాంధీ సైతం.. నీట్ లీకేజీ అంశంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాక్రోచ్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఉగ్రవాదులతో కూడా పోల్చింది బీజేపీ. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తూ మరింత బలోపేతం అవుతూ వస్తుందే తప్ప తగ్గడం లేదు.
దీంతో మోడీ, అమిత్ షా ద్వయాలకు తత్వం బోధపడినట్టుంది. అందుకే జెన్-జీ ఏం కోరుకుంటోంది..? కేంద్రం తప్పిదాలేమిటీ? అని లోపాలపై ఆత్మపరిశీలన చేసుకుంటోంది. జెన్-జీని దూరం చేసుకోవడం మూలంగా తమకు నష్టం కలగడమే కాదు.. కాంగ్రెస్కు ఇది కలిసివస్తోందనే విషయాన్నీ గ్రహించింది కేంద్రం. రాహుల్ కూడా మొన్నటి వరకు జెన్-జీ అంశాన్ని సైలెంట్గా గమనిస్తూ వచ్చారు. కానీ ఆయన కూడా ఇప్పుడు బహిరంగంగా వారికి సపోర్టు చేస్తున్నారు.
దీంతో ఇది ప్రమాదకర సంకేతంగా మోడీ దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. నీట్ పేపర్ లీకేజీ విషయంలో.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ త్వరలో జరగనున్నట్టు వస్తున్న వార్తల్లో.. మొదట పడే వికెట్ ధర్మేంద్రదేనని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది.
మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం.. మిత్ర పక్షాల మద్దతే మోడీని మూడోసారి నిలబెట్టడం కూడా.. వాస్తవ పరిస్థితులను కళ్లముందుంచాయి. దీనికి తోడు దేశంలో జెన్-జీ పై పెరిగిన విపరీతమైన క్రేజ్.. వారు స్పందించే తీరు.. మొత్తానికి కేంద్రానికే గురిపెట్టిన వైఖరి.. అంతా ఆ పార్టీని తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే కాక్రోచులను మరింత రెచ్చగొట్టి చిచ్చు పెట్టుకునే బదులు.. జరిగిన తప్పిదాలను సైలెంట్గా దిద్దుకోవడం ద్వారా దీనికి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా.. సద్దుమణిగేలా చేయడమే తరుణోపాయంగా మోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మొన్న పార్లమెంటులో పెట్టిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం.. మోడీకి చేదు అనుభావాన్ని చవిచూపింది. దక్షిణాదిన పూర్తిగా పట్టు కోల్పోయిన బీజేపీ… ఉత్తరాదిన కూడా.. ఈ జెన్-జీ మూలంగా ప్రభావం తగ్గుతుందనే కోణంలో ఆలోచిస్తోంది.