మొన్న కేసీఆర్ కూడా అన్నాడు. మనం కొనుగోలు చేసినప్పుడు ఇన్ని కష్టాలు రాలేదు. అంతా సాఫీగా సాగింది. మరిప్పుడు ఈ సర్కార్ ఎందుకు సమయానికి ధాన్యం కొనుగోళ్లు చేయలేకపోతున్నది అని. ఇవాళ సీఎం రేవంత్రెడ్డి దీనికి గల కారణాలను తెలియజేశారు. ఇప్పటి వరకు 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబుతున్న సర్కార్.. ఇంకా 20 శాతం కొనుగోలు చేయాల్సి ఉందని కూడా వెల్లడిస్తున్నది. అయితే ఎందుకు మరి ఇంకా ఇది సకాలంలో చేయడం లేదు. లేటు అయినా కొద్దీ రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
దీనికి కారణం ఏమిటని లోతుగా ఆలోచించే వాళ్లు లేరు గానీ.. సర్కార్ ఈ విషయంలో వైఫల్యం చెందిందని మాత్రం ప్రచారం జరుగుతోంది. ఇది ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితే సర్కార్కు. రైతులు ధాన్యం కుప్పల వద్ద చనిపోవడం, అకాల వర్షాలకు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం తడిచి పూర్తిగా పెట్టుబడికి నష్టం రావడం .. రైతుల గోస వర్ణనాతీతం. అయితే ప్రతీసారి మాదిరిగానే ఈసారి కూడా హమాలీల కొరతే ప్రధాన కారణంగా సర్కార్ చెబుతున్నది. హమాలీలు ఎక్కువగా పశ్చిమ బెంగాల్కు చెందిన వారై ఉండటం.. వీరంతా మొన్నటి ఎన్నికల కోసం ముందుగానే ఇక్కడి నుంచి వెళ్లిపోవడం సమస్యగా మారింది.
వెళ్లిన హమాలీలు తిరిగి రావడానికి 3, 4 నెలల సమయం తీసుకోవడంతో.. అప్పటికప్పుడు ధాన్యం సేకరణ విషయంలో హమాలీలను సర్దుబాటు చేసుకోవడంలో సర్కార్ ముందస్తు చర్యలు తీసుకోలేకపోయింది. దీంతో కొంత ఆలస్యం జరిగింది. ఇక సర్కార్ ఆరోపిస్తున్న మరో విషయం.. కావాలనే బీఆరెస్ లీడర్లు .. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు దింపకుండా అడ్డుకుంటున్నారని. దాదాపుగా చాలా మిల్లులు అప్పటి బీఆరెస్ ప్రభుత్వంలో బాగా లబ్ది చేకూరినవే ఉన్నాయనేది సర్కార్ ఆరోపణ. వారంతా ఇప్పుడు ఆ పార్టీ నేతలు చెప్పినట్టే వింటున్నారని, మిల్లులకు వచ్చిన లారీలలో ఉన్న ధాన్యాన్ని దించుకోకుండా.. కావాలనే రోజుల తరబడి తాత్సారం చేస్తున్నారని సర్కార్ గమనించింది.
ఇలా చేయడం ద్వారా ఆ లారీలు.. అక్కడే మిల్లుల్లోనే మగ్గడం.. రవాణా సదుపాయాలు సరిపడా లేక కూడా సేకరికంచిన ధాన్యాన్ని మిల్లులకు పంపేందుకు ఇబ్బందులు రావడంతో తీవ్ర జాప్యం జరుగుతున్నదని ప్రభుత్వ పరిశీలనలో తేలినట్టు చెబుతున్నారు. హమాలీలు సరైన సమయానికి అందుబాటులో లేకుండా పోవడం.. రవాణా వ్యవస్థను బీఆరెస్ నాయకులు తమ రాజకీయ దురుద్దేశంతో వాటిని నిలిపివేసేలా మిల్లర్లతో మిలాఖత్ కావడం వల్లే ఇదంతా జరుగుతుందని స్వయంగా సీఎం చెప్పడం చర్చకు తెర తీసింది. ఈ లోపాలను, జాప్యాలను అన్నింటినీ పరిశీలించే .. జిల్లా యంత్రాంగాలను క్షేత్రస్థాయిలో దింపి.. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.
ఓ వైపు ఇవాళే కేటీఆర్ .. సీఎంకు ఈ విషయంలోనే బహిరంగ లేఖ రాశాడు. తమ పాలనలో రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారని, ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులే లేవన్నారు. కానీ ఇప్పుడు సర్కార్ చేతగానితనం వల్ల .. రైతులు కళ్లాల మీదే చనిపోతున్నారని, దీనికి కారణం రేవంత్ రెడ్డి సర్కారేనని ఆరోపించాడు ఆ లేఖలో కేటీఆర్. అయితే ఇదే సందర్భంలో రేవంత్ కూడా కేటీఆర్కు ఈ విషయంలో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఈ సీజన్లో ఎవరి పాలనలో ఎంతెంత ధాన్యం కొనుగోలు చేశారో చూద్దామా అని సవాల్ విసిరిన ఆయన.. రైతులు చనిపోయిన మాట వాస్తవమే.. కానీ ప్రతిపక్షంగా మీరేం చేయాలి? వారికి అండగా ఉండి.. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయండి.. సెల్ఫీలు దిగి.. మీ శాడిస్టిక్ ప్లెజర్ను పదే పదే బయట పెట్టుకోవడమెందుకు? అని విమర్శించారు.