మళ్లీ ఓ ప్రచారం తీవ్రమైంది. బీజేపీలోకి హరీశ్రావు వెళ్తున్నాడని. హరీశ్ వైపు బీజేపీ చూస్తోందని. ట్రబుల్ షూటర్గా పేరున్న హరీశ్రావును ట్రబుల్లోకి నెట్టేసే ప్రయత్నమే తప్ప అందులో వాస్తవం లేదని అందరికీ తెలుసు. కానీ, ఓ సెక్షన్ దీన్ని బలంగా ప్రచారం చేయడం ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నది. ఓ వైపు బావబామ్మర్దులిద్దరూ చెరో వైపు పర్యటనలు, మీటింగులతో బిజీబిజీగా ఉన్నారు. ఎవరికి వారే చిట్చాట్లు పెడుతున్నారు. ప్రెస్మీట్లు పెడుతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు.
సీఎం రేవంత్రెడ్డిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. కేసీఆర్ ఫామ్హౌజ్కే పరిమితమైనా.. వీరిద్దరు మాత్రం పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. దీనికి తోడు తెలంగాణ భవన్లో నిత్యం ఐదుగురు నేతలకు తగ్గకుండా ప్రెస్మీట్లు పెడుతూనే ఉన్నారు. ఓ రకంగా పార్టీని ఉరుకులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు హరీశ్రావు, కేటీఆర్లిద్దరు.
మొన్ననే మోడీ వచ్చి బహిరంగ వేదికగా.. రేవంత్ను తమతో కలిసి రావాలని, నిధులు ఎక్కువగా తెచ్చుకోవచ్చ వెటకారంతో కూడిన అభ్యర్థన ఒకటి రాజకీయంగా దుమారం రేపింది. వీరిద్దరికీ మధ్య ఏదో ఉంది… ఎప్పటికైనా రేవంత్ బీజేపీకి వెళ్తాడు.. ఎందుకంటే.. తెలంగాణలో ఈ బీజేపీ నేతల ముఖాలతో అధికారంలోకి రావడం కల్ల.. అని మోడీ డిసైడ్ చేసుకుని ఈ విధంగా అన్నారని అంతా అనుకున్నారు. అయితే రేవంత్రెడ్డి అంత ఈజీగా పార్టీ మారడు. తనకో క్లారిటీ ఉంది. కాకపోతే రెండు టర్ములు తనే సీఎంగా ఉండాలనుకుంటున్నాడు. అదీ కాంగ్రెస్ ద్వారా. మళ్లీ మళ్లీ పార్టీ మారితే రేవంత్ను కూడా జనాలు నమ్మరు. అది ఆయనకూ తెలుసు.
ఇదీగాక, రేవంత్.. రాహుల్పై తన విశ్వాసాన్ని చూపాలనుకుంటున్నాడు. పార్టీలోకి రాగానే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి.. పార్టీని అధికారంలోకి తీసుకురాగానే సీఎంను చేయడం ద్వారా కాంగ్రెస్కు విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు రేవంత్. అయితే మోడీ.. హరీశ్ను సీఎం చేస్తామని ఆశపెట్టి పార్టీలోకి తీసుకురావడం మూలంగా.. తెలంగాణలో ఈజీగా అధికారంలోకి రావొచ్చని భావిస్తున్నాడనే ప్రచారం ఊపందుకున్నది. దీనిపై కొన్ని టీవీలలో చర్చలు కూడా కొనసాగుతున్నాయి. కానీ వాస్తవాలు అలా లేవు.
ఇప్పుడు హరీశ్రావుకు బీఆరెస్ను అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ఉంది. మొదట పోయిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ఇందులో ఆ పార్టీ నేతలకు ఎలాంటి అనుమానాలు లేవు. కేటీఆర్ కూడా హరీశ్ను కలుపుకుని పోతున్నాడు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనే హరీశ్ ప్రకటనను కేటీఆర్ సమర్థించాడు. చాలా విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయి. రేపు అధికారంలోకి బీఆరెస్ వస్తే.. కేటీఆర్ను కేసీఆర్ సీఎం చేసినా.. హరీశ్ సైలెంట్గానే ఉంటాడు. తనకు సీఎం కావాలనే కోరిక ఉంది.. ఇది అందరికీ తెలుసు.
కానీ ఇది సరైన సమయం కాదనుకుంటున్నాడు హరీశ్. దాని కోసం ఇంకొంతకాలం వేచి చూసే దోరణినే అవలంభించాలనుకుంటున్నాడు. దీని కోసం అప్పటి వరకు బీఆరెస్కు సిన్సియర్గానే పనిచేస్తాడు తప్ప… డబుల్ రోల్ పోషించే చాన్స్ లేదు. ఇప్పుడు జరిగే ప్రచారమంతా రాజకీయాలను సైడ్ ట్రాక్ పట్టించేవే అనడంలో ఎలాంటి అనుమానం లేదు.