తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల అంశం సెగ.. జాతీయ రాజకీయాలకు తాకనుంది. గతంలోనూ కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ విధమైన ఆందోళన చేశారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే బాటలో సాగనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 15 వరకు తెలంగాణలో మొత్తం ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయని సర్కార్ ప్రకటించింది. ఇది పూర్తవగానే కిషన్రెడ్డి వెంట పడతానని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రకటించడం.. ఇదెంత సీరియస్ ఇష్యూ కానుందో తెలియజేసినట్టైంది. వాస్తవానికి ఏనాడూ కేంద్రం తెలంగాణలో పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయలేదు. చేయదు.
ప్రతిసారీ తెలంగాణ సర్కార్కు ధాన్యం కొనుగోలు తిప్పలు తప్పడం లేదు. మొత్తం కొనుగోలు చేయాలని ఇక్కడి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ పోవడం.. వారు తమకెంత కావాలో అంతే కొనుగోలు చేసి మిగితాది పట్టించుకోకపోవడంతోనే మొత్తం భారం సర్కార్పై పడుతుంది. మళ్లీ సీజన్ నాటికి గోదాములు ఖాళీ లేకపోవడం..తదితర సమస్యలు ఉత్పన్నం కావడంతో.. ప్రతిసారీ రైతులకు ధాన్యం కొనుగోలు సకాలంలో జరగడం లేదు. దీని వల్ల ప్రభుత్వం బద్నామవుతూ వస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి మళ్లీ కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో ఉన్నట్టు తాజా ప్రకటన ద్వారా అవగతమవుతోంది.
చేతగాకపోతే గద్దె దిగాలని కిషన్రెడ్డి .. రేవంత్రెడ్డిని విమర్శించడంతో ఇది జాతీయ స్థాయిలో మంటలు రేపే దాకా పోయింది. మోడీని దిగిపోవాలని రేవంత్ కొత్త డిమాండ్ను ఎత్తుకున్నారు. మోడీ దిగిపోతే.. రాహుల్ను ప్రధానిని చేస్తానని, అప్పుడు ఇక్కడి ధాన్యమంతా కొనుగోలు చేపించడం కాదు.. కావాల్సిన నిధులను కూడా తెప్పిస్తానని అన్నారు. కిషన్రెడ్డికి .. సీఎం ఈనెల 15 వరకు డెడ్లైన్ ఇచ్చారు. ఆ తరువాత మీ సంగతి చెబుతానని వార్నింగ్ ఇవ్వడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.
ఇంతకు ముందు కూడా కిషన్రెడ్డి ఇంటి ముందు ధాన్యం పోసి నిరసన తెలుపుతానని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిది ముదిరి పాకాన పడనుంది. కిషన్రెడ్డికి వచ్చిందిప్పుడు తంటా! దీనిపై బీజేపీకి, సర్కార్ మధ్య జరిగే ఫైట్ మరింత వేడెక్కనుంది. ఇందులో మోడీ, రాహుల్లను కూడా లాగేలా ఉన్నారు. దీంతో ఇది జాతీయ ఇష్యూగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.