డీలిమిటేషన్ అంశం.. ఇప్పటికే తెలంగాణ బీజేపిని డిఫెన్స్లో పడేస్తున్నది. దీన్ని ఓన్ చేసుకునే స్థితిలో ఆ పార్టీ లేదు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా మరింత ఇబ్బందికరంగా మారుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ..అఖిలపక్షం నిరసనలు, ఆందోళనలకు దిగుతున్నారు. దీనిపై పార్లమెంటులో సీరియస్గా చర్చ జరగుతున్నది. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి దీనిపై లేఖ రాశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ బిల్లు ప్రతులను తగులబెట్టారు.
కేటీఆర్ సైతం దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం 24 శాతంగానే ఉండాలని, పాత విధానంలో ఏ మాత్రం మార్పు రావొద్దని, కట్టె విరగకుండా, పాము చావకుండా కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. ఇదిలా ఉండగా.. ఇంకో కొత్త కామెంట్ తెలంగాణ బీజేపీని మరింత ఇరకాటంలో పడేసింది. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటులో జరుగుతున్న చర్చలో భాగంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటు అంశాన్ని తీసుకొచ్చారు. ఇది అసందర్భమైన, అనాలోచిత చర్యగానే చూడాలి. కాంగ్రెస్ను ఇరుకన పెట్టాలనే యోచనలో భాగంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఆనాటి యూపీఏ సర్కార్ పాకిస్తాన్-భారత్ విభజనతో పోల్చడంతో ఒక్కసారిగా రాజకీయంగా దుమారం రేపింది.
తెలంగాణలో భావోద్వేగాలను రెచ్చగొట్టినట్టయ్యింది. ఇప్పటికే బీజేపీ వైఖరిపై ఇక్కడి ప్రజలు గుర్రుగా ఉన్నారు. మళ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకే ఈ డీలిమిటేషన్ను హడావుడిగా చేపట్టి.. నార్త్లో లోక్సభ సీట్లు పెంచుకునేందుకు చూస్తున్నదని కాంగ్రెస్తో పాటు దక్షిణాది ప్రాంతీయ పార్టీలన్నీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణలో కూడా రాజకీయాలకు అతీతంగా ఈ చర్య ద్వారా జనానికి వచ్చిన మేలు ఏమీ లేదని, ఇది కేవలం రాజకీయ క్రీడలో భాగంగానే కేంద్రం చేస్తున్న ఓ హడావుడి చర్యగా భావిస్తున్నారు.ఇదే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో తేజస్వీ మధ్యలో తెలంగాణ ఇష్యూను పాకిస్తాన్తో లింకు పెట్టి మాట్లాడటం.. తెలంగాణ బీజేపిని మరింత ఇరకాటంలో పడేసింది. ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలను గెలిచారు. ఇప్పుడు వీరంతా జనానికి సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడి ప్రజలు కూడా బీజేపీకి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో , ఎంతటి ప్రేముందో పరోక్షంగా ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు తాజాగా డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కూడా గొప్పగా చెప్పుకోవడానికి చాన్సు లేక.. వస్తున్న విమర్శలను తిప్పికొట్టలేక… ఇబ్బందులు పడుతున్నది ఇక్కడి నాయకత్వం. ఇది చాలదంటూ.. తేజస్వీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు మరింత ఇరకాటంలో పడేశాయి. దీంతో కేంద్రం మహిళా బిల్లును ఆమోదింపజేసుకున్నా.. దాన్ని ఆ పార్టీ ఇక్కడ సంబురంగా చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు.