తెలంగాణ జన సమితి నాలుగో ప్లీనరీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. మొత్తం 20 తీర్మానాలు చేశారు. అందులో 9 తీర్మానాలు కీలక నిర్ణయాలుగా ఉన్నాయి. సర్కార్తో మిత్రపక్షంలో ఉన్న టీజేఎస్.. ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్.. మొన్ననే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తరుణంలోనే ఇవాళ జరిగిన పార్టీ నాలుగో ప్లీనరీలో సర్కార్కు వ్యతిరేకంగా, ఆచరణలో ఉన్న వ్యతిరేక విధానాలకు నిరసన రూపంగా ఉన్న తీర్మానాలు రాజకీయంగా చర్చకు తెరలేపాయి.
కాంగ్రెస్ తమను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయకపోవడంతో పాటు.. తాము చెప్పిన విధానాలను మొదటి ఏడాది కొన్ని అనుసరించి .. ఆ తరువాత గత పాలకుల మాదిరిగానే ముందుకు సాగడం.. ప్రజలకు ఇబ్బందికరంగా మారిందనే విషయాన్ని చెప్పుకొచ్చిందీ ప్లీనరీ వేదిక. కాంగ్రెస్ పార్టీ ఆచరణ తప్పిదాల వల్ల మళ్లీ బీఆరెస్ ఊపిరి పోసుకుంటున్నదని, ఇది తెలంగాణ ప్రజలకు నష్టం చేకూర్చే అంశంగా పేర్కొన్నది ఆ పార్టీ. అందరివాడుగా ఉన్న కోదండరామ్.. కాంగ్రెస్తో జత కట్టడం వల్ల .. ప్రస్తుత ఆ పాలకుల తీరు వల్ల అప్రతిష్ట పాలయ్యారనే విషయాన్ని పేర్కొనడం ఆ పార్టీ మార్చుకున్న లైన్కు నిదర్శనంగా నిలుస్తున్నది.
అంతే కాదు… చాలా విషయాల్లో సర్కార్ తీరును వ్మతిరేకించింది ఈ ప్లీనరీ. కేసీఆర్ అవినీతిపై విచారణ చేస్తామన్నారు.. జైలుకు పంపుతామన్నారు? ఎక్కడా అని ప్రశ్నించింది. విచారణ కమిటీ రిపోర్టులను అటకెక్కించారని మండిపడింది. ఈ రెండు పార్టీల చర్యల వల్ల సందట్లో సడేమియాలో తెలంగాణలో బీజేపీ పాగా వేసేందుకు యత్నిస్తున్నదని ఇది మరింత ప్రమాదకరమని కూడా హెచ్చిరిక చేసింది ప్లీనరీ సమావేశం. 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా పాత విధానాలనే ఎందుకు కొనసాగిస్తున్నారు? కార్పొరేట్ ప్రయోజనాలే లక్ష్యంగా ఎందుకు పనిచేస్తున్నారు? మూసీ ప్రక్షాళన పేరుతో పేద ప్రజలను ఎందుకు ఖాళీ చేయిస్తున్నారు? అని ప్రశ్నించడంతో పాటు.. ఉద్యమ ఆకాంక్షల సాధనకు ఈ ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత తగ్గుతున్నదని, ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించింది. చేసిన 20 తీర్మనాల్లో 9 తీర్మానాలు రాజకీయ చర్చకు వచ్చాయి.
ఆ పార్టీ తీసుకున్న కొత్త లైన్కు సంకేతంగా నిలిచారు. ఉద్యమకారులకు గుర్తింపు దక్కలేదు, నిర్లక్ష్యం కొనసాగుతోంది. సామాజిక తెలంగాణ- బీసీ రిజర్వేషన్లు. బలవంతపు భూసేకరణ ఆపాలి.సింగరేణి పరిరక్షణ- కార్మిక హక్కుల సంరక్షణ, నదీ జలాల్లో తెలంగాణ వాటా. ఫీజు రియంబర్స్మెంట్. ఎస్ఐఆర్ పేరుతో ఓటు హక్కు తొలగింపుపై పోరాటం. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రలకు అన్యాయం. నిరుద్యోగ సమస్య… ఇవి కీలక తీర్మానాలుగా ఉన్నాయి. సర్కార్తో ఇకపై మిత్రపక్షమా? లేక వైరిపక్షమా? అంటే.. ఈ తీర్మానాలు అమలు రూపంలో తీసుకుంటే.. వైరి పక్షంగానే టీజేఎస్ కొనసాగనుందని చెప్పాలి.