ఢిల్లీ వెళ్లిన పవన్కు హనుమంతుడి బలం వచ్చినట్టుంది. నోరు కొద్దిగా గట్టిగానే లేచింది. తెలంగాణలో నీ అయ్య జాగీరా! అనే వివాదస్పద, రెచ్చగొట్టే మాటల ద్వారా తను కూడా ఉన్నానని జనానికి చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఉనికే లేని పార్టీకి కొత్త జీవం పోసేందుకు ఈ రెచ్చగొట్టే విధానాన్నే ఎంచుకున్నట్టున్నాడు. మోడీ మంత్రం ఉపదేశించాడు. పవన్ అదే వల్లెవేస్తున్నాడనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో జనసేన పార్టీ మీటింగు పెట్టుకున్నాడు. మళ్లీ అవే మాటలు.
తెలంగాణ నేతలు మోడీకి గజ్జున వణుకుతున్నారట. మోడీ మెడలు వంచుతాం.. నిలదీస్తం.. ప్రశ్నిస్తం.. కడిగేస్తం.. అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి.. ఢిల్లీకి రాగానే సైలెంట్ అయిపోతారట. ఇవీ పవన్ కళ్యాణ్ మాటలు. అంటే మోడీని చూడగానే.. ఢిల్లీలో అడుగు పెట్టగానే అప్పటి దాకా గాండ్రించిన తెలంగాణ పెద్ద పులులు.. పిల్లులై పోయి మ్యావ్.. మ్యావ్ మని మోడీ చుట్టూ ప్రదక్షిణ చేసి బయట పడతాయట. ఈ మాటలు కేసీఆర్, రేవంత్రెడ్డి.. ఇద్దరికీ వర్తిస్తాయి.
ఎందుకంటే మొదట మోడీతో బాగానే ఉన్నా.. తరువాత కాలంలో బాగా వైరం పెంచుకున్నాడు కేసీఆర్. కిషన్రెడ్డిని రండా అని తిట్టినట్టే.. అమిత్ షాను భ్రమిత్ షా అన్నాడు. మోడీతో ఏదీ కాదన్నాడు. తెలంగాణపై మోడీ విషం చిమ్ముతున్నాడని కూడా విమర్శించాడు. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరి స్నేహం ఎంతలా విడిపోయిందంటే.. తెలంగాణ గడ్డపైకి వచ్చి బహిరంగ వేదిక సాక్షిగా … కేసీఆర్ తన వద్దకు వచ్చి తన కొడుకును సీఎం చేయాలనుకుంటున్నానని.. మీ ఆశీస్సులు కావాలని.. అడిగాడని.. తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం.. అని కేసీఆర్ ముఖం మీద చెప్పానని వెల్లడించడం కలకలం రేపింది.
ఈ విషయంపై కేసీఆర్ కూడా స్పందించాడు. లోపల రహస్యంగా మాట్లాడిన మాటలు ఇలా బయటపెట్టడం పీఎం విజ్ఞతకే వదిలేస్తున్నానన్నాడు. అంటే తాను కేటీఆర్ను సీఎం చేయడం కోసం మోడీ సాయం కోరిన విషయాన్ని ఒప్పుకున్నాడు. ఆయన దీన్ని ఒప్పుకోకపోవడంతోనే ఇద్దరి మధ్య రాజకీయ అగాధం ఏర్పడినట్టుగా ఈ సంఘటన ద్వారా అందరికీ తెలిసిపోయింది. తరువాత కేసీఆర్.. మోడీని ఎంత టార్గెట్ చేసినా జనం పెద్దగా పట్టించుకోలేదు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు లాంటి వివాదస్పద కేంద్ర నిర్ణయాలను స్వాగతించి, అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదింపజేసుకున్న కేసీఆర్ను .. మోడీ విషయంలో నమ్మడం మానేశారు.
దీంతో ఆయన మోడీపై చేసే పులిగర్జనను పిల్లి అరుపులుగా కూడా చూడలేదు ఇక్కడి జనం. ఇప్పుడు రేవంత్ విషయం పరిశీలించినా అదే అనిపిస్తోంది జనాలకు. ఇక్కడ తిడుతున్నాడు. అక్కడ కలుస్తున్నాడు. కానీ పనులు కావడం లేదు. కనీసం కేసీఆర్ ఢిల్లీ దాకా ధాన్యం ఇష్యూ తీసుకుపోగలిగాడు. మరి రేవంత్ కూడా అదే బాట పడతాడా? ఢిల్లీ పెద్దలతో రేవంత్ వైఖరి ఎలా ఉండబోతుంది? తను అనుకున్న సిద్దాంతం ప్రకారం.. పవన్ కళ్యాన్ అన్నట్టుగా అక్కడ గర్జన.. ఇక్కడ పిల్లి మొగ్గలేనా? ఇప్పుడు రాజకీయాల్లో ఇదే టాపిక్ నడుస్తోంది.
అంటే మోడీతో ఎవరు పెట్టుకున్నా.. వారి పని ఖతం అనే విధంగా పవన్ కామెంట్లు చేయడం ఓ రకంగా ఇక్కడి నేతలను బెదిరించే పనిలో ఉన్నాడా? తన పార్టీని జాకీలు పెట్టి లేపే క్రమంలో.. మోడీ తన వెనుక ఉన్నాడు.. అనే సంకేతాలను ఇక్కడి నేతలకు పంపుతున్నాడా?