watch avoid from heart attack:- గుండెపోటు ముప్పును గుర్తించే మెడికల్ వాచ్ ‘కార్డియాక్సెన్స్’కు భారత ప్రభుత్వ అనుమతి లభించింది. ఇజ్రాయెల్ కు చెందిన కార్డియాక్సెన్స్ లిమిటెడ్ సహకారంతో… పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఎక్స్ ప్లోర్ హెల్త్ సంస్థ… ఈ మెడికల్ వాచ్ను రూపొందించి, ఇటీవలే లాంచ్ చేసింది. ఇప్పుడు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ రెగ్యులేటరీ అథారిటీ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్-CDSCO.. దేశంలో ఈ వాచ్ వాణిజ్య విక్రయాలకు అనుమతి ఇచ్చింది.
‘కార్డియాక్సెన్స్’ వాచ్ను ఇప్పటికే అమెరికాకు చెందిన ఎఫ్డీఏ ఆమోదించింది. గుండె పనితీరును అత్యంత కచ్చితంగా అంచనా వేసే ఏకైక మెడికల్ వాచ్గా ఇప్పటికే ఇది ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా… ముఖ్యంగా భారతదేశంలో ఇటీవల గుండెపోటు మరణాలు చాలా ఎక్కువ అయ్యాయి. కరోనా తర్వాత యువకులు కూడా గుండెపోటు కారణంగా మృత్యువాత పడుతున్నారు. గుండె నుంచి వచ్చే ముందస్తు హెచ్చరిక సంకేతాలను ఎక్కువ మంది అర్థం చేసుకోలేకపోవడమే చాలా మరణాలకు కారణమని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ‘కార్డియాక్సెన్స్’ వాచ్ ద్వారా గుండె పనితీరును నిరంతరం పర్యవేక్షించడం వీలవుతుందని… హృదయ స్పందన పెరిగినా, తగ్గినా తక్షణమే ఈసీజీ తీసి వైద్యులకు షేర్ చేయమని హెచ్చరిస్తుందని… ఎక్స్ ప్లోర్ హెల్త్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. వాచ్ అలర్ట్ చేసిన వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే… గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు.
ఇప్పటికే 40కి పైగా దేశాలు ఆమోదించిన ‘కార్డియాక్సెన్స్’ వాచ్కు భారతదేశంలోనూ అనుమతి లభించడం శుభ పరిణామం అని ఎక్స్ ప్లోర్ హెల్త్ సంస్థ చెబుతోంది. ప్రస్తుతం దీని ధర రూ.1 లక్షగా ఉంది. ఈ వాచ్ అందరికీ అందుబాటులో ఉంచేందుకు… సులభ వాయిదా పద్ధతితో పాటు అనేక ఇతర పథకాల ద్వారా అమ్మకాలు జరుపుతామని ఎక్స్ ప్లోర్ హెల్త్ వెల్లడించింది.