France Heatwave: ఫ్రాన్స్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో వైరల్ అవుతోంది. తీవ్రమైన వేడిని తట్టుకోలేక పారిస్ ప్రజలు.. ప్రముఖ ఫర్నిచర్ షోరూమ్ లో సేద తీరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. షాపింగ్ పేరుతో ఫర్నిచర్ షాపుకు వెళ్లి.. ఏసీ చల్లదనంలో అక్కడి సోఫాలు, బెడ్స్ పై రిలాక్స్ అవుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తీవ్రమైన వడగాల్పులు, ప్రాణాంతక ఉష్ణోగ్రతల నుండి తప్పించుకోవడానికి పారిస్ ప్రజలు.. వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. నగరంలోని ప్రముఖ ‘ఐకియా’ (IKEA) హోమ్ ఫర్నిషింగ్ స్టోర్లోకి తరలి వెళ్తున్నారు. అక్కడ ఉన్న ఏసీ గాలి, చల్లదనంలో గంటలతరబడి రిలాక్స్ అవుతున్నారు. షాపులో అమ్మకానికి ఉంచిన సోఫాలు, బెడ్స్ పై పడుకొని.. సేద తీరుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో.. ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
People in Paris at IKEA to get some AC relief from the heat wave. pic.twitter.com/MtVI0ju8Qh
— Misy7 (@MisyDP) June 29, 2026
వైరల్ అవుతున్న వీడియోలో.. ఐకియా స్టోర్లో ఉంచిన బెడ్లు, సోఫాలు, కుర్చీలపై స్థానిక ప్రజలు హాయిగా విశ్రాంతి తీసుకుంటుండటం కనిపిస్తోంది. బయట ఎండ తీవ్రత ఊహించని స్థాయిలో ఉండటంతో ఇళ్లల్లో ఏసీలు లేని వారు రోడ్లపై తిరగలేని వారు.. ఐకియా స్టోర్ను ఒక సురక్షితమైన ప్రదేశంగా భావిస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. స్టోర్ యాజమాన్యం సైతం వారిని గమనించినప్పటికీ.. మానవతా దృక్పథంతో వారిని అడ్డుకోకుండా అలాగే వదిలేయడం విశేషం.
మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘నిజంగా ఇది చాలా తెలివైన ఆలోచన. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంతకంటే మంచి ప్రదేశం దొరకదు’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘వాతావరణ మార్పుల తీవ్రతకు ఇదొక హెచ్చరిక లాంటిది’ అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు కష్టకాలంలో ప్రజలను స్టోర్ లోపల రిలాక్స్ అయ్యేందుకు అనుమతించిన ఐకియా యాజమాన్యాన్ని పలువురు అభినందిస్తున్నారు.
Also Read: టోస్టర్ vs శాండ్విచ్ మేకర్.. మార్నింగ్ టిఫిన్ కోసం.. ఏది బెస్ట్ ఛాయిస్?
సాధారణంగా ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాల్లో వేసవి కాలం చాలా తక్కువ రోజులే ఉంటుంది. అది కూడా ఉష్ణోగ్రతలు చాలా నామమాత్రంగా ఉంటాయి. మిగిలిన కాలమంతా చల్లగా, వర్షం పడుతూ ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు గడిపేస్తుంటారు. దీని వల్ల తమ ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు ఫిక్స్ చేసుకొని వాడాల్సిన అవసరం ప్రజలకు పెద్దగా రాలేదు. అయితే ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతుండటంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక 1000 మందికి పైగా ఫ్రాన్స్ పౌరులు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇళ్లల్లో ఏసీలు లేనివారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని.. ఎండ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: 40 డిగ్రీలకే కరిగిన బ్రిటన్ రోడ్లు.. 45 దాటినా చెక్కుచెదరని భారత్ రోడ్లు.. అసలు రహస్యం ఇదే!