Bus Accident: దారుణం.. పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న ఒక బస్సు నియంత్రణ కోల్పోయి పర్వత ప్రాంతం నుంచి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. బలూచిస్థాన్లోని షేరానీ జిల్లా ధనాసర్ ప్రాంతం మీదుగా ఖైబర్ పఖ్తుంఖ్వా వైపు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా నుంచి పెషావర్ నగరానికి బయలుదేరిన ఈ బస్సులో ప్రమాద సమయంలో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
ప్రమాదానికి అసలు కారణం ఇదే..
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ బస్సు మొదట క్వెట్టా నుంచి 36 మంది ప్రయాణికులతోనే బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో మరో బస్సు పాడైపోవడంతో, ఆ వాహనంలోని ప్రయాణికులను కూడా ఇదే బస్సులోకి ఎక్కించుకున్నారు. దీనివల్ల బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. దీనికి తోడు డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడంతో, ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా భారీ వాహనం పర్వతం పైనుంచి ఒక్కసారిగా కింద ఉన్న లోయలోకి పడిపోయిందని షేరానీ డిప్యూటీ కమిషనర్ వలీ ఖాన్ కాకర్ వెల్లడించారు.
తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు..
ఈ ఘోర ప్రమాదంపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు, స్థానిక జిల్లా యంత్రాంగం వెంటనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని వెలికితీసి చికిత్స నిమిత్తం ఝోబ్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అధికారులు, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.
Also Read: వైద్య చరిత్రలోనే మహా అద్భుతం.. ఒకేసారి 5 అవయవాల మార్పిడితో యువకుడికి పునర్జన్మ!
Heartbreaking news from Balochistan: 🚌 🚨 🚨
A passenger bus met with a tragic accident after plunging into a deep ravine in the Danasar area. 40 people lost their lives, while 8 others sustained injuries. pic.twitter.com/C0b0vfjBhQ— Ayesha Ufaq (@Ufaq_RM) July 3, 2026