Instagram: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం Meta సంస్థకు భారత ప్రభుత్వం మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. Instagramలో లైంగిక వేధింపులను ప్రోత్సహించే విధంగా ఉన్న కొన్ని ప్రకటనలపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మెటా ప్రతినిధులకు సమన్లు జారీ చేయాలని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తమ శాఖ అధికారులను ఆదేశించారు. దేశంలో ఆన్లైన్ భద్రతను పణంగా పెడితే ఊరుకునేది లేదని ప్రభుత్వం ఈ చర్యతో స్పష్టం చేసింది.
మెటా యాజమాన్యంలోని యాప్స్పై కేంద్ర ప్రభుత్వం ఈ వారంలోనే చర్యలు తీసుకోవడం ఇది రెండోసారి. కొద్దిరోజుల క్రితమే వాట్సప్ తీసుకురావాలని చూస్తున్న username ఫీచర్పై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు పంపింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రకటనల వ్యవహారం తెరపైకి రావడంతో మెటా ఇబ్బందుల్లో పడినట్లయింది.
Also Read: Lava Agni 4, Bold సిరీస్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. Amazon Saleలో బెస్ట్ బడ్జెట్ డీల్స్ ఇవే!
వాట్సప్ తీసుకురావాలనుకుంటున్న యూజర్నేమ్ ఫీచర్ వల్ల ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, ఇతరుల పేర్లతో మోసాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వంతో చర్చలు ముగిసి, పూర్తి స్పష్టత వచ్చే వరకు ఈ ఫీచర్ రోల్అవుట్ను నిలిపివేయాలని ఆదేశించింది. ఐటీ చట్టాల ప్రకారం మెటాపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కూడా నిలదీసింది.
భారతదేశంలో సోషల్ మీడియా మధ్యవర్తిగా కొనసాగుతున్న మెటా సంస్థ.. ఇక్కడి ఐటీ చట్టాలను, నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కేంద్రం గుర్తు చేసింది. యూజర్ల భద్రతకు ముప్పు వాటిల్లే ఎలాంటి ఫీచర్లు లేదా ప్రకటనలను అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. తాజా సమన్ల నేపథ్యంలో మెటా ఎలాంటి వివరణ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: రెడ్ కలర్లో Nothing సరికొత్త ఫోన్.. RCB లోగోతో క్రేజీ లుక్.. ఆ ఒక్క స్టోర్లోనే లభ్యం!