El Niño: వర్షాభావ పరిస్థితులకు తోడు పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్నినో’ రాక్షసి విరుచుకుపడుతోంది. ఫలితంగా రాష్ట్రంలో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఓవైపు తాగునీటి ఎద్దడి గుమ్మం ముందుకు వచ్చి నిలబడితే, మరోవైపు వానాకాలం పంటలు ఎలా సాగు చేయాలనే వేదన రైతాంగాన్ని వెంటాడుతోంది. రాష్ట్రానికి జీవధారలైన కృష్ణా, గోదావరి బేసిన్లలోని జలాశయాలు నీళ్లులేక వెలవెలబోతున్నాయి. ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో ఇన్-ఫ్లోలు రాకపోవడంతో ప్రాజెక్టులు ఎండిపోయి, డెడ్ స్టోరేజీకి చేరువవుతున్నాయి.
ఆకాశం వైపు కళ్లు కాయలు కాచేలా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతోభారీ వర్షాలు కురువడం లేదు. తుప్పర్ల జల్లుమాత్రమే కురుస్తుంది. ఫలితంగా రాష్ట్రంలోని ఎగువ, దిగువ జలాశయాలన్నీ అడుగంటిపోయి, ఊళ్లు-పట్నం తేడా లేకుండా జలగండం విరుచుకుపడుతోంది. ఓవైపు సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను చూసి గుండెకోతతో రైతన్నలు రోడ్డెక్కుతుంటే.. మరోవైపు మహానగరం హైదరాబాద్తో సహా పలు పట్టణాల్లో గుక్కెడు తాగునీటి కోసం ట్యాంకర్ల ముందు జనం క్యూ కడుతున్నారు. మున్ముందు ఈ నీటి ఎద్దడి ఎంతటి తీవ్రరూపం దాలుస్తుందోనన్న భయం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది.
ఉత్తర తెలంగాణాకు ప్రధాన వనరైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 80.5 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం కేవలం 17.79 టీఎంసీలు మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆయకట్టుకు నీరందించడం ప్రాజెక్ట్ అధికారులకు పెను సవాలుగా మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టులో 17.8 టీఎంసీలకు గాను 6.44 టీఎంసీలు, ఇక రాజధాని హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల తాగునీటి అవసరాలు తీర్చే సింగూరులో 4.28 టీఎంసీలే మిగిలాయి. అప్పర్ మానేరు 0.60 టీఎంసీలతో దాదాపు ఎండిపోయిన స్థితికి చేరింది. ఎల్లంపల్లిలో సైతం 7.83 టీఎంసీల నీరు , లోయర్ మానేరులో 24.03 టీఎంసీలకు గాను 5.55 టీఎంసీలు, సింగూరు ప్రాజెక్టులో 29.92 టీఎంసీలకు గాను కేవలం 4.28 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ప్రాజెక్టులోని నీరు మిగలడం వర్షాభావ తీవ్రతకు నిదర్శనం.
Also read: నీట్ పేపర్ లీక్ తీవ్ర దుమారం.. రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్, ప్రదీప్ రంగనాథన్!
గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఐదు బ్యారేజీల్లో సున్యా టీఎంసీలు ఉన్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. పార్వతీ బ్యరేజీలో 8.83 టీఎంసీలకు గాను నీటి నిల్వలేదని, సరస్వతీ బ్యారేజీలోనూ 10.87 టీఎంసీలకు సున్నా టీఎంసీలు స్టోరేజీ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. లక్ష్మీ బ్యారేజీలో 16.17 టీఎంసీలు, సమ్మక్క బ్యారేజీ 6.94 టీఎంసీలు, సీతమ్మసాగర్ బ్యారేజీ 36.57 టీఎంసీలకు గాను సున్నా టీఎంసీలు గా నిల్వ ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు అత్యంత కీలకమైన శ్రీశైలంప్రాజెక్టు పూర్తి నీటిమట్టం215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిల్వలు 41.45 టీఎంసీలకు పడిపోయాయి. ఇటు నాగార్జునసాగర్లో 315.05 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 137.51 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆల్మటిలో 129.72 టీఎంసీలకు గాను 101.19, నారాయణ పూర్ రిజర్వాయర్ లో 37.64 టీఎంసీలకు 24.67 టీఎంసీలు, తుంగభద్రలో 105.79 టీఎంసీలకు గాను 25.8 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎగువ నుంచి ఆశించిన మేర వరద రాకపోతే కృష్ణా డెల్టా పరిధిలో పంటల సాగు ప్రమాదంలో పడింది.
Also read: కేద్రంలో బీజేపీ పతనం మొదలైది.. మంత్రి ఉత్తమ్ సంచలన హెచ్చరిక!
ఈ ఏడాది నమోదైన వర్షాభావ పరిస్థితులకు ఎల్నినో ప్రభావమే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుతుపవనాల రాక మందగించడం, ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో జలాశయాల్లో ఆవిరి శాతం కూడా పెరిగింది. పర్యవసానంగా ప్రాజెక్టుల నీటి మట్టాలు నానాటికీ అడుగంటిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో10 నుంచి 12 మీటర్ల లోతునకు జలాలు పోతున్నాయి. రాజధాని హైదరాబాద్లో తాగునీటి తిప్పలు వర్ణనాతీతంగా మారాయి. సింగూరు, మంజీర, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లలో నీటి నిల్వలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది.
ప్రాజెక్టుల్లో ఉన్న అరకొర నీటిని సాగునీటి కాలువలకు మళ్లించకుండా, కేవలం తాగునీటి అవసరాలకే నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత నీటి లభ్యతను బట్టి ఏ పంటలు వేయాలో రైతాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.రాబోయే రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ట్యాంకర్లు, బోర్వెళ్ల పునరుద్ధరణ వంటి చర్యలపై ఇప్పటినుంచే దృష్టి సారించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది.
Also Read: KTR: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ నోటీస్..?