ప్రపంచంలోని చాలా దేశాల్లో వేసవి వచ్చిందంటే ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఏసీ లేకుండా జీవించడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. అయితే జర్మనీతో పాటు ఉత్తర ఐరోపాలోని అనేక దేశాల్లో మాత్రం ఇప్పటికీ చాలా ఇళ్లలో ఏసీలు ఉండవు. ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవలి వరకు జర్మనీ, డెన్మార్క్, ఆస్ట్రియా లాంటి దేశాల్లో వేసవి కాలం పెద్దగా ఇబ్బంది కలిగించేంత వేడిగా ఉండేది కాదు. అందుకే ఇళ్ల నిర్మాణంలో కూడా వేడిని తట్టుకునే సౌకర్యాల కంటే చలికాలంలో ఇంట్లో వేడిని నిల్వ ఉంచే విధానాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల అక్కడి ఇళ్లలో ఏసీలు అవసరం అనిపించలేదు. అమెరికాలో దాదాపు 90 శాతం ఇళ్లలో ఏసీలు ఉన్నాయి. కానీ, యూరప్ లో ఈ సంఖ్య కేవలం 20 శాతం ఉంటుంది. జర్మనీలో 6 శాతం ఇళ్లలో మాత్రమే ఏసీలు ఉన్నాయి. దీనికి ఖర్చు కూడా ఒక కారణం. అక్కడ విద్యుత్ ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది ఏసీలను కొనడానికి, ఉపయోగించడానికి ఇష్టపడరు.
ఇప్పుడు ఆయా దేశాల్లోనూ పరిస్థితి మారుతోంది. వాతావరణ మార్పుల ప్రభావంతో యూరప్ లో కూడా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే వేసవిలో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర వడగాలులను ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
2019 నుంచి 2024 మధ్య జర్మనీలో ఏసీలు, కూలింగ్ యూనిట్ల విక్రయాలు దాదాపు 75 శాతం పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ చాలామంది ఇప్పటికీ ఏసీని ఒక విలాస వస్తువుగానే చూస్తున్నారు. వేడిని తగ్గించేందుకు కిటికీలకు కర్టెన్లు వేయడం, ఫ్యాన్లు ఉపయోగించడం, చల్లటి నీరు తాగడం లాంటి పాత పద్ధతులనే ఎక్కువగా అనుసరిస్తున్నారు.
యూరప్లో పాత భవనాల్లో ఏసీ వ్యవస్థలు ఏర్పాటు చేయడం కూడా సులభం కాదు. చారిత్రక భవనాలు, కఠినమైన నిర్మాణ నిబంధనలు, అధిక ఖర్చు కారణంగా కొత్త కూలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం చాలా మందికి సాధ్యం కావడం లేదు. అలాగే అద్దె ఇళ్లలో ఉండేవారికి కూడా ఏసీ ఏర్పాటు చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది.
మరోవైపు, ఎయిర్ కండిషనర్ల వినియోగం పెరగడం వల్ల విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో ఎక్కువ భాగం ఇప్పటికీ శిలాజ ఇంధనాల నుంచే వస్తోంది. దీంతో కార్బన్ ఉద్గారాలు పెరిగి భూతాపం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయాలపై కూడా యూరప్ దృష్టి పెడుతోంది. కొత్త భవనాలను సహజ గాలి సులభంగా ప్రవహించేలా నిర్మించడం, చెట్లను పెంచడం, నీడ కల్పించే నిర్మాణాలు ఏర్పాటు చేయడం, హీట్ పంపులు, స్మార్ట్ కూలింగ్ టెక్నాలజీలను ఉపయోగించడం లాంటి చర్యలు చేపడుతుంది. ఒకప్పుడు ఏసీ అవసరం లేని దేశంగా పేరొందిన జర్మనీ ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా క్రమంగా కూలింగ్ టెక్నాలజీల వైపు అడుగులు వేస్తోంది.
Read Also:అదరగొట్టిన టీవీఎస్ ఐక్యూబ్.. మిలియన్ మైల్ స్టోన్ క్రాస్!