Chetan Sharma : ఓ టీవీ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన శర్మ పదవికే ఎసరు పెట్టింది. ఆ స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ సంచలన విషయాలను వెల్లడించారు. భారత్ జట్టులో పరిస్థితులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కొందరు క్రికెటర్లు ఫిట్ నెస్ కోసం ఇంజక్షన్లు తీసుకుంటారని ఆరోపించారు. ఆ క్రికెటర్లు వాడుతున్న ఇంజక్షన్లు డోపింగ్ పరీక్షల్లో సైతం గుర్తించలేరని సంచలన విషయాలను బయపెట్టాడు.
చేతన్ శర్మ వ్యాఖ్యలతో బీసీసీఐ కల్లోలం రేగింది. ఇక ఆయనను తొలగిస్తారని టాక్ వచ్చింది. సాగనంపడం లాంఛనమేనని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలని బీసీసీఐ ఒత్తిడి తెచ్చిందో లేక తాను తప్పుకోవాలనుకున్నారో గానీ చేతన్ శర్మ చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశారు. బీసీసీఐ సెక్రటరీ జై షాకు రాజీనామా లేఖను పంపారు. ఆయన రాజీనామాను బీసీసీఐ కూడా ఆమోదించినట్లు తెలుస్తోంది.
టీమిండియా క్రికెటర్లపై ఇటీవల చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు టీమిండియాలో రెండు వర్గాలు ఉన్నాయని బయటపెట్టారు. ఆ గ్రూపులకు కోహ్లీ, రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తారని చెప్పారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కోహ్లీల మధ్య కూడా అంతర్గత చర్చలకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. ఈ స్టింగ్ ఆపరేషన్కు సంబంధించిన వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. జట్టుకు సంబంధించిన రహస్య వివరాలు బయటకు రావడంపై బీసీసీఐ తీవ్రంగా పరిగణించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చేతన్ శర్మ వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. వేటు వేయక ముందే పదవి నుంచి తప్పుకున్నారు.