Danish Kaneria On India: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) తీసుకునే నిర్ణయాలను నిత్యం విమర్శించే ఆయన… ఇండియాకు సపోర్ట్ గానే మాట్లాడుతుంటారు. ముఖ్యంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే, ఇచ్చి పడేస్తారు. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ పాలిటిక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ( Danish Kaneria). ఇండియాలో జరిగే ప్రతి నిరసన వెనుక ఒక స్క్రిప్ట్ ఉంటుందని బాంబు పేల్చారు. ఈ అంశం తనను కలవర పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచేలా భారతదేశంలో రాజకీయాలు కొనసాగుతున్నాయని సీరియస్ అయ్యారు. ఇది హిందూ ధర్మానికే చేటు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ఇండియాలో మొన్నటి వరకు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్ ఎక్కారు. కాక్రోచ్ జనతా పార్టీ రంగంలోకి దిగిన నేపథ్యంలో కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఈ నిరసనలలో పాల్గొన్నాయి. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేయడం జరిగింది. అయితే ఈ నిరసనలు దాదాపు రెండు వారాలపాటు జరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం గురించే చర్చ జరిగింది.
ఈ విషయంపైనే తాజాగా డానిష్ కనేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో జరిగే ప్రతి నిరసన కార్యక్రమం వెనుక స్క్రిప్ట్ ఉంటుందని బాంబు పేల్చారు. కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఓ శక్తి ఉందని.. కుట్ర లో భాగంగానే వాళ్లు నిరసనలకు దిగారని ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించేందుకు ఈ నిరసనలు చేశారని ఆగ్రహించారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు డానిష్ కనేరియా.
జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసనలలో సమస్యలపై నిర్ణయాత్మకమైన చర్చలు లేదా పరిష్కారాలపై ఎలాంటి ఫోకస్ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేయలేదని ఆరోపణలు చేశారు డానిష్ కనేరియా. కేవలం శ్రీరాముడు, ఇండియా, హిందుత్వం, ప్రధాని నరేంద్ర మోడీని దూషించడమే లక్ష్యంగా ఈ నిరసనలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ శక్తులు దేశంలో అశాంతిని రేకెత్తించి… శత్రు దేశాలకు సహకరిస్తున్నాయని కూడా బాంబు పేల్చారు. ప్రతిపక్షాల నిరసనలు ఓ సర్కస్ లాగా తయారయ్యాయని మండిపడ్డారు. దీనిపై మోడీ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.