IPL 2025 DC vs MI: ఎన్నో అడ్డంకులు దాటి మళ్లీ ప్రారంభమైన ఐపిఎల్ 2025 టోర్నీ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ కోసం టాప్ 6 జట్లు పోటీపడుతున్నాయి. కానీ ఈ జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయి. ఏ మాత్రం ఆటతీరు సరిగా లేకపోయినా లేదా ఒక్క మ్యాచ్ ఓడిపోయినా డిసి ఇక ఎలిమినేట్ అయ్యే చాన్సులున్నాయి. ప్లేఆఫ్స్ టాప్ 4 స్పాట్ లో చోటు దక్కించుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లలో ఢిల్లీ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.
ఈ రెండు విజయాలతో వచ్చే పాయింట్స్ లేకపోతే తదుపరి రౌండ్ కు వెళ్లడం అక్సర్ పటే ల్ సారథ్యంలోని టీమ్ కు చాలా కష్టం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ జట్టు తలపడబోతోంది. కానీ బుధవారం జరిగే ఈ మ్యాచ్ కు వరుణుడి గండం ఉంది. ఈ కారణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ బాస్ లు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ప్లే ఆఫ్స్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న డిసి యజమాన్యానికి వర్షం పడితే తమ జట్టు ఇక ఇంటి ముఖం పట్టాల్సిందేనా అనే ఆలోచనలో పడింది.
ఎందుకంటే మరో నాలుగు రోజుల వరకు ముంబై నగరానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆక్యూవెదర్ వాతావరణ సంస్థ ప్రకారం.. నగరంలో 80 శాతం చిరుజల్లులు, 1.5 గంటల పాటు వర్షం పడే అవకాశాలున్నాయి. అయితే రాత్రి వరకు వర్షం పడే చాన్సులు 25 శాతానికి తగ్గిపోతాయి. కానీ ప్రస్తుతం ముంబైలో వాతావరణం చూస్తూ.. వర్షం పడదు అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఏం జరుగుతుంది?
ముంబై, ఢిల్లీ రెండు జట్లకు ప్లే ఆఫ్స్ చాన్సులు ప్రస్తుతానికి ఉన్నాయి. కానీ వర్షం పడితే మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ కు లాభం చేకూరుతుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో ముంబై ఇప్పటికే ఢిల్లీ కంటే ఒక పాయింట్ ఎక్కువతో లీడ్ లో ఉంది. ఇప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలు మొత్తం ఆ వర్షంలో కొట్టుకుపోతాయి. ఎందుకంటే వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. కానీ ఆ పరిస్థితుల్లో ముంబై కి మొత్తం 15 పాయింట్ల స్కోర్ ఉంటుంది. కానీ ఢిల్లీ జట్టు మాత్రం 14 వద్దే ఆగిపోతుంది.
ఆ తరువాత ఈ రెండు జట్లు కూడా పంజాబ్ కింగ్స్ తో లీగ్ దశ చివరి మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే.. ఇక పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఓడిపోతేనే ఢిల్లీకి మరో చాన్స్ ఉంటుంది. కానీ ముంబై ఇండియన్స్.. పంజాబ్ కింగ్స్ ను ఓడించేస్తే మాత్రం ఇక ఢిల్లీ ఇంటికే. ఆ తరువాత పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ గెలిచినా ఓడినా దాని ప్రభావం ఉండదు.
Also Read: IPL మ్యాచులకు ఎక్స్ట్రా టైం పెంపు…ఇక రాత్రి 1:15 గంటల వరకు
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలంటే ఎలా?
ఐపిఎల్ ప్రస్తుతం సీజన్లో ప్రారంభంలో దూకుడా ఆడుతూ అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వచ్చిన ఢిల్లీ ఆ తరువాత చతికల పడింది. అందుకే ఇప్పుడు ప్లేఆఫ్స్ కోసం ఇబ్బందులు పడుతోంది. ఫైనల్ ఫోర్లో చోటు సంపాదించుకోవాలంటే ఒకటి తప్పనిసరిగా జరగాలి.. అదే పంజాబ్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి. ఇదే ముంబైకి చివరి లీగ్ మ్యాచ్. పైగా బుధవారం ముంబైతో తలపడే మ్యాచ్ తప్పనిసరిగా జరగాలి. ఆ మ్యాచ్ లో ఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి తీరాలి. ఈ రెండూ జరిగితేనే ఢిల్లీకి ఎలిమినేషన్ ప్రమాదం తప్పుతుంది.