Kavya Maran On Hardik Pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 tournament) నేపథ్యంలో ఇప్పటి నుంచి ఫ్రాంచైజీ జట్లు సంసిద్ధమవుతున్నాయి. ఇతర జట్లలో ఉన్న కీలక ఆటగాళ్లపై కన్నేసి.. ట్రేడ్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అతడు ముంబై ఇండియన్స్ జట్టును వీడి బయటకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా ఈ ప్రక్రియ పూర్తయినట్లే తెలుస్తోంది. ఈ వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కోసం మిగిలిన ఫ్రాంచైజీలు ఎగబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ మొదట ప్రయత్నాలు జరపగా.. ఇప్పుడు కేకేఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అతడికి కెప్టెన్సీ పదవితో పాటు భారీగా డబ్బులు కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోందట.
హార్దిక్ పాండ్యా గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతడికి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య పాప దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ట్రేడ్ ప్రక్రియ ద్వారా హార్దిక్ పాండ్యాను తీసుకుంటామని కావ్య పాప ముందుగా ఆఫర్ ఇచ్చారట. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మాత్రం తనకు కెప్టెన్సీ తో పాటు 20 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారట. గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెట్టిన కండిషన్ సన్రైజర్స్ హైదరాబాద్ ముందు హార్దిక్ పాండ్యా ఉంచినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై చర్చించిన కావ్య పాప, హార్దిక్ పాండ్యా కండిషన్ ను రిజెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఐపీఎల్ 2027 నేపథ్యంలో పాట్ కమ్మిన్స్ అందుబాటులో లేకపోతే అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిషన్ ఇద్దరిలో ఎవరో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వాలని ఆమె అనుకుంటున్నారట.
కొత్తగా వచ్చే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తే తీవ్రస్థాయిలో ట్రోలింగ్ అయ్యే ప్రమాదం ఉందని ఆమె గ్రహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ పదవి తాత్కాలికంగా ఇచ్చినందుకే యువరాజ్ సింగ్ లాంటి సీనియర్ క్రికెటర్లు హైదరాబాద్ యాజమాన్యం పై మండిపడ్డారు. ఇక ఇప్పుడు ఊసరవెల్లిలా రంగులు మార్చే హార్థిక్ పాండ్యాను తీసుకువచ్చి కెప్టెన్సీ ఇస్తే.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం గ్యారెంటీ అని కావ్య పాప ముందే గ్రహించినట్లు తెలుస్తోంది. అందుకే హార్దిక్ పాండ్యా పెట్టిన కండిషన్లకు ఆమె ఓకే చెప్పనట్లు తెలుస్తోంది. వస్తే సాధారణ ప్లేయర్ గా అవకాశం ఇస్తాం.. కెప్టెన్సీ మాత్రం ఇవ్వబోమని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
గుజరాత్ టైటాన్స్ జట్టుకు గతంలో హార్థిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ జట్టుకు తొలి సీజన్ లోనే టైటిల్ కూడా అందించాడు. కానీ ఆ తర్వాత ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రావడంతో తిరిగి వెనక్కి వచ్చాడు పాండ్యా. ఇప్పుడు మళ్లీ ముంబై యాజమాన్యంతో గొడవ పెట్టుకుని బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకు కెప్టెన్సీ ఇవ్వాలని గుజరాత్ టైటాన్స్ జట్టును కూడా హార్దిక్ పాండ్యా అడిగాడట. అయితే దీనికి గిల్ మాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది.