![Virat Kohli Emotional Speech on his Career](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/03/VIRAT-1280-x-720.jpg)
Virat Emotional Speech on his Career: క్రికెట్ మ్యాచ్ లో ఎప్పుడూ పులిలా గర్జించే విరాట్ కోహ్లీ ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యాడు. పంజాబ్ కింగ్స్ తో బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యాడు.
జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. కనిపించేవి రికార్డులు, సెంచరీలు, గణాంకాలు, ఘనతలు కావు. జ్ఞాపకాలు మాత్రమేనని అన్నాడు. ఈ రోజు మ్యాచ్ గెలిచాం. ఎంతో మనసు పెట్టి ఆడాను. ఇక్కడ ప్రతి బాల్ నుంచి పరుగులు చేయాలనే తపనతోనే ఆడాను. ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాను. కానీ నాకు మిగిలేది.. ఒక అందమైన జ్ఞాపకం మాత్రమేనని అన్నాడు.
”చిన్నస్వామి స్టేడియంలో అభిమానుల మధ్య కలిసి ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నాను. రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ మనకు మిగిలేది రికార్డులు కాదు. జ్ఞాపకాలు మాత్రమేనని చెబుతుంటారు. ఆడే సమయంలో ప్రాణం పెట్టి ఆడాలి. ఈ క్షణాన్ని మళ్లీ పొందలేం. అందరి నుంచి ప్రేమ, ప్రశంసలు, మద్దతు అందుకోవడం చాలా గొప్పగా ఉంది” అని అన్నాడు.
Also Read: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. ఆర్సీబీ బోణి..
గత రెండు నెలలు భారత్లో లేనని, తనని, తన ఫ్యామిలీని గుర్తుపట్టని ప్రాంతంలో అజ్ఞాతంగా గడిపామని కోహ్లి తెలిపాడు. కానీ అటు ఫ్యామిలీ, ఇటు క్రికెట్ మధ్య తీవ్ర మానసిక అలజడికి గురయ్యానని అన్నాడు.
విరాట్ మాటలను బట్టి చూస్తే బహుశా మరో రెండేళ్లలో క్రికెట్ కి గుడ్ బై చెప్పేసేలాగే ఉన్నాడని అంటున్నారు. సచిన్ 100 సెంచరీల రికార్డ్ కోసం ఇక ప్రయత్నించడని అంటున్నారు. వస్తే సంతోషం, లేదన్నా ఫీల్ అవడని అంటున్నారు. కానీ అభిమానులు మాత్రం విరాట్ మాటలతో షాక్ కి గురయ్యారు.
బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగు వికెట్లు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి 49 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో 11 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి.