Rajasthan Royals beats Mumbai Indians in 38th Match of IPL 2024: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో దాదాపు అన్ని జట్లు పైకి, కిందకి అవుతుంటాయి. కానీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం నెంబర్ వన్ ప్లేస్ లోనే కొనసాగుతోంది. ఎక్కడా తగ్గడం లేదు. ఇక ముంబయితో జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ సెంచరీ చేయడంతో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన ముంబయి మొదట బ్యాటింగు చేసి 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 18.4 బంతుల్లో ఒక వికెట్ నష్టానికి 183 పరుగులు చేసి విజయకేతనం ఎగురవేసింది. మ్యాచ్ అంతా ఏకపక్షంగా సాగింది. ముంబయి చేష్టలుడిగి అలా చూస్తూ ఉండిపోయింది.
180 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ ఏ దశలో కూడా తొణకలేదు. బెణకలేదు. మొదటి బాల్ నుంచి సాధికారికంగానే ఆడారు. ముఖ్యంగా యశస్వి జైశ్వాల్ 7 మ్యాచ్ ల తర్వాత ఫామ్ లోకి వచ్చి సెంచరీ చేశాడు. 60 బంతుల్లో 7 సిక్స్ లు, 9 ఫోర్ల సాయంతో 104 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
Also Read: ఇక ఆర్సీబీ ఇంటికే.. ప్లే ఆఫ్ దారులు మూసుకుపోయినట్టే!
జాస్ బట్లర్ 25 బంతుల్లో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా తొలి వికెట్ 74 పరుగుల వద్ద పడింది. తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ చాలా తెలివిగా ఆడాడు. స్ట్రయికింగ్ ఎక్కువగా యశస్వికి ఇచ్చాడు. నెమ్మదిగా తనతో ఆడించాడు. ఈ క్రమంలో తను 28 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతేకాదు తన వంతుగా 2 సిక్స్ లు, 2 ఫోర్లు కొట్టాడు.
ముంబయి బౌలర్లు ఏ దశలోనూ ప్రభావం చూపలేకపోయారు. దాదాపు ఏడుగురు బౌలింగు చేశారు. హార్దిక్ పాండ్యాకి ఒక దశలో అర్థమైపోయింది. సీరియస్ గా తీసుకోవడం మానేశాడు. మొత్తానికి రాజస్థాన్ 18.4 ఓవర్లలో 183 పరుగులు చేసి గెలిచి నెంబర్ వన్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ముంబై మాత్రం 7వ స్థానంలో స్థిరపడిపోయినట్టే కనిపిస్తోంది.
ముంబయి బౌలింగులో యశస్వి ఆఖరికి బుమ్రాని కూడా వదల్లేదు. తనకి కూడా సిక్సర్లు, ఫోర్లు రుచి చూపించాడు. పియూష్ చావ్లా ఒక్కడికే ఒక్క వికెట్ పడింది.
Also Read: Hardik Pandya: నెట్టింట ఫైటింగ్.. రోహిత్ ను పరోక్షంగా విమర్శించిన హార్దిక్
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కి ఆదిలోనే బ్రేక్ పడింది. ఓపెనర్లు ఇషాన్ డక్ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ (6) చేసి బ్యాట్ ఎత్తేశాడు. ఆ తర్వాత కాపాడతాడని అనుకున్న సూర్య కుమార్ (10) చేసి అవుట్ అయ్యాడు. తను ఒక మ్యాచ్ ఆడుతుంటే, ఒక మ్యాచ్ పోగొడుతున్నాడు. మరి ఇదేం లెక్కో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
తర్వాత తిలక్ వర్మ మీద బాధ్యత అంతా పడింది. దాంతో తను 45 బంతులు ఎదుర్కొని 3 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నెహాల్ వధేరా కాసేపు ధడధడలాడించాడు. 24 బంతుల్లో 4 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 49 పరుగులు చేసి, ఆఫ్ సెంచరీ ముందు అవుట్ అయిపోయాడు.
వీరి తర్వాత హార్దిక్ (10), టిమ్ డేవిడ్ (3), కొయెట్జీ (0) అందరూ నిరాశపరిచారు. మొత్తం 11 మందిలో తిలక్ వర్మ , నెహాల్ ఇద్దరే ఆడారు. దీంతో ముంబయి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
Also Read: Mumbai Indians: ముంబై డేంజర్ బెల్స్.. మూసుకుపోతున్న ప్లే ఆఫ్ దారులు
రాజస్థాన్ బౌలింగులో సందేప్ శర్మ 5 వికెట్లు తీశాడు. ఆఖరి డెత్ ఓవర్ లో అన్ని జట్ల బౌలర్లు పరుగులు ఇస్తుంటే, తను ఏకంగా మూడు వికెట్లు తీసి శభాష్ అనిపించాడు. ఇక ట్రెంట్ బౌల్ట్ 2, ఆవేశ్ ఖాన్ 1, చాహల్ 1 వికెట్ తీశారు.
అటు ఆర్సీబీ, ఇటు ముంబయి రెండూ ఒకేలా వెళుతున్నాయి. కాకపోతే ఆర్సీబీ మీద ముంబయి కొంత పర్వాలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాగే ఆడితే ప్లేఆఫ్ నుంచి రెండూ బయటకు వచ్చేలాగే ఉన్నాయి.