CM Jagan declared assets: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ ఆస్తులను వెల్లడించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆస్తుల వివరాలతో కూడిన ఎన్నికల అఫిడవిట్ను జగన్ తరపు వరుసకు బాబాయ్ వైఎస్ మనోహర్రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. జగన్ మొత్తం ఆస్తుల విలువ 757.65 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు.
ఐదేళ్ల కిందట ఫ్యామిలీ ఆస్తుల విలువ 510 కోట్ల రూపాయలు కాగా, ఇప్పుడది ఏకంగా 247 కోట్లు పెరిగి 48 శాతానికి చేరింది. పేదల ప్రతినిధిగా చెప్పుకునే సీఎం జగన్ పేరిట 529 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు న్నాయి. 2019లో జగన్ ఒక్కరి ఆస్తుల విలువ 375 కోట్లు కాగా, గడిచిన ఐదేళ్లలో ఆస్తుల విలువ ఏకంగా 41 శాతం అంటే 154 కోట్ల రూపాయలు పెరిగిందన్నమాట. జగన్ ఫ్యామిలీలో ఎవరికీ సొంతంగా కారు లేదు. చేతిలో ఉన్న నగదు కేవలం ఏడువేల రూపాయలు మాత్రమే. ఇద్దరి కుమార్తెల పేరిట 51 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ భార్య భారతి పేరిట 124 కోట్లు, ఇద్దరు కుమార్తెల పేరిట 11 కోట్లు ఉన్నట్లు ప్రస్తావించారు.
జగన్ వైఫ్, కూతురు.. రిలయన్స్, జియో ఫైనాన్షియల్స్లో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించారు. సీఎం జగన్పై 26 కేసులు ఉన్నాయి. 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో నిందితుడు. వివిధ పోలీసుస్టేషన్లలో ఆరు కేసులున్నాయి. రెండేళ్లు కరోనా సమయంలోనూ జగన్ ఆస్తుల విలువ భాగానే పెరిగిందన్నమాట.
జగన్కు ఇడుపులపాయలో 35 ఎకరాల భూమి ఉంది. ఇడుపులపాయ, భాకరాపురం, బంజారాహిల్స్, సాగర్ సొసైటీలో ఆస్తులున్నాయి. వ్యవసాయేతర భూముల విలువ 46 కోట్ల రూపాయలుగా చూపించారు. భారతి పేరిట దాదాపు ఐదున్నర కోట్ల విలువ చేసే ఆరున్నర కేజీల బంగారం, వజ్రాలు ఉన్నాయి.
ALSO READ: అన్ని వర్గాలకు అనుకూలంగా కూటమి మేనిఫెస్టో.. పేదలకు ఇళ్ల స్థలాలు: చంద్రబాబు
జగన్ అఫిడవిట్ను అన్ని కోణాల్లో పరిశీలిస్తే.. ఎన్నికల నోటరీని రాజమండ్రిలో తయారు చేయించారు. స్టాంపులను విజయవాడలో కొనుగోలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ను ఈసారి పులివెందులలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేయించడం ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో అఫిడవిట్ను పులివెందులలో తయారు చేయించారు.