Shashank Singh IPL| ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత తమ తొలి ట్రోఫీని గెలుచుకుంది. అయితే, ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించినది పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఆటగాడు శశాంక్ సింగ్. పంజాబ్ ఓటమి పాలైనప్పటికీ, శశాంక్ తన అద్భుత ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
పంజాబ్ 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఉండగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్తో సహా సీనియర్ ఆటగాళ్లందరూ తడబడ్డారు. కానీ ఒకే ఒక్కడు ఆర్సీబీ విజయానికి అడ్డంకిగా నిలబడ్డాడు. అతనే యంగ్ క్రికెటర్ శశాంక్ సింగ్. ఒకవైపు పంజాబ్ జట్టు కీలక వికెట్లు కోల్పోతుండడంతో ఒత్తిడి పెరుగుతున్నా, అతను భారీ సిక్సర్లతో, చాకచక్యంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ పంజాబ్ అభిమానుల్లో ఆశలు రగిలించాడు. చివరి ఓవర్ వరకు విజయం కోసం పోరాడుతూ, కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోయాడు. ఈ ఓటమిలోనూ శశాంక్ ధైర్యంగా ఆడిన తీరు చూసి.. పంజాబ్ కింగ్స్ అభిమానుల్లోనే గాక ఐపిఎల్ అభిమాను మనసులో కూడా స్థానం సంపాదించాడు.
సోషల్ మీడియాలో నెటిజెన్లంతా శశాంక్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు అతని పోరాట పటిమను “సింహ గర్జన”గా అభివర్ణించారు. శశాంక్ ఇప్పుడు భారత జట్టులో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. డొమెస్టిక్ క్రికెట్లో చాలా కాలంగా ఆడుతున్న శశాంక్ సింగ్.. ఐపీఎల్ ఫైనల్లో చూపించిన తెగువ అతని కెరీర్ కు ఉపయోగపడుతుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత, ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు విజయోత్సవంలో మునిగిపోయారు. కానీ, శశాంక్ మైదానంలో కూర్చొని భావోద్వేగానికి లోనయ్యాడు. అది చూసిన నెటిజెన్లు పంజాబ్ కు సపోర్ట్ గా కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఐపిఎల్ సీజన్ పంజాబ్ కింగ్స్ జట్టుకు మరచిపోలేనిది. ఫైనల్ వరకు చేరి కప్పు గెలవకపోవడంతో ఆ బాధ గుర్తుండిపోతుందని నెటిజెన్లు కామెంట్లు చేస్తన్నారు.
టార్గెట్ ఛేజ్లో విఫలమైన పంజాబ్
అహ్మదాబాద్లో 191 పరుగుల లక్ష్యంతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య జోడీ శుభారంభానిచ్చింది. కానీ, ఫిల్ సాల్ట్ అద్భుత క్యాచ్తో ప్రియాంశ్ ఔట్ కావడంతో ఆర్సీబీ డామినేషన్ ప్రారంభమైంది. శ్రేయాస్ అయ్యర్, ప్రభ్సిమ్రన్ లాంటి కీలక వికెట్లు పంజాబ్ కింగ్స్ వెను వెంటనే కోల్పోయింది. జోష్ ఇంగ్లిస్ను కృనాల్ పాండ్యా ఔట్ చేశాడు. 13వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన శశాంక్ పోరాడాడు, కానీ నెహాల్ వఢేరా నెమ్మదిగా ఆడటంతో జోరు తగ్గింది. భువనేశ్వర్ కుమార్ ఒకే ఓవర్లో వఢేరా, స్టోయినిస్లను ఔట్ చేయడంతో ఆర్సీబీ విజయం దాదాపు ఖాయమైంది. హేజెల్వుడ్ బౌలింగ్లో సిక్సర్లు కొట్టినా, చివరి ఓవర్లలో శశాంక్ కు స్ట్రైక్ తక్కువగా రావడంతో ఓటమి తప్పలేదు.
Also Read: ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడలేను.. ఐపిఎల్ రిటైర్మెంట్పై స్పందించిన కొహ్లీ
బెంగుళూరులో ఆర్సీబీ విజయ పరేడ్
బెంగళూరులో ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ విజయాన్ని ఘనంగా జరుపుకోనుంది. విధాన సౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు మధ్యాహ్నం 3:30 గంటలకు బస్సు పరేడ్ జరుగుతుంది. అభిమానులు ఎరుపు, నలుపు జెండాలతో సందడి చేస్తారు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. “ఈ విజయం అభిమానులది. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్లను బెంగళూరుకు ఆహ్వానిస్తున్నాను,” అన్నాడు. ఇందిరానగర్, కోరమంగళ, ఎంజీ రోడ్లలో అభిమానులు “ఈ సలా కప్ నమ్దే” అంటూ రాత్రంతా ఉత్సవం జరుపుకున్నారు.