RCB Virat Kohli| ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ కళ్లలో ఆనంద బాష్పాలు కనిపించాయి. జోష్ హాజిల్వుడ్ 20వ ఓవర్లో రెండో బంతిని వేసినప్పుడు, కోహ్లీ భావోద్వేగంతో మోటెరా మైదానాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఈ క్షణం కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారు. ఐపీఎల్ ఈ సీజన్లో 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ విజయం కోహ్లీ కెరీర్ లో ఒక మైలురాయిగా మారింది. “ఈ విజయం జట్టుకు ఎంత ముఖ్యమో, అభిమానులకు కూడా అంతే ముఖ్యం. నేను 18 ఏళ్లుగా ఈ జట్టు కోసం నా యవ్వనం, శక్తి, అనుభవం అన్నీ అర్పించాను. ప్రతి సీజన్లో గెలవాలని ప్రయత్నించాను,” అని కోహ్లీ తన భావాలను మాటల్లో వ్యక్తం చేశాడు.
ఫైనల్ మ్యాచ్ తర్వాత, అలసిపోయిన కోహ్లీ తన భార్య అనుష్కను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఈ జంట ఈ క్షణాన్ని నమ్మలేకపోయారు. “చివరి బంతి వేసిన తర్వాత భావోద్వేగంతో నిండిపోయాను. నా శక్తినంతా ఈ జట్టు కోసం ధారపోశాను. ఈ విజయం అద్భుతంగా అనిపిస్తోంది,” అని అతను చెప్పాడు.
తన సన్నిహిత స్నేహితుడు ఏబీ డివిలియర్స్ ఫైనల్ క్షణాల్లో బౌండరీ దగ్గర నిలబడి ఉన్నాడు. ఆర్సీబీ ఇన్నేళ్ల ప్రయాణంలో డివిలియర్స్ పాత్రను కోహ్లీ ప్రశంసిస్తూ.. అతడికి గొప్ప నీరాజనం పలికిడు. “డివిలియర్స్ ఈ జట్టు కోసం చేసిన కృషి అద్భుతం. నీవు రిటైర్ అయినా, నీవు ఈ జట్టుకు ఎంతో చేశావు. ఈ విజయం నీది కూడా. నీవు మాతో కలిసి ఈ ట్రోఫీని ఎత్తాలి,” అని అన్నాడు.
కోహ్లీని కామెంటేటర్ మాథ్యూ హేడెన్ ఈ ఐపీఎల్ ట్రోఫీని వన్డీ వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్లతో సమానంగా భావిస్తున్నారా? అని అడిగాడు. దీనికి సమాధానంగా.. కోహ్లీ మాట్లాడుతూ.. “నా కెరీర్ లో ఈ ట్రోఫీ ఎంతో స్పెషల్. నేను అందుకున్న కప్ లలో ఇదే నాకు టాప్. నేను 18 ఏళ్లుగా ఈ జట్టు కోసం అన్నీ ఇచ్చాను. నేను ఎప్పుడూ ఈ జట్టుతోనే ఉన్నాను. బెంగళూరు నా హృదయంలో, నా ఆత్మలో ఉంది. ఈ జట్టుతోనే నా చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడతాను,” అని కోహ్లీ చెప్పాడు.
Also Read: జియో హాట్స్టార్ వ్యూయర్షిప్ రికార్డ్.. ఐపిఎల్ ఫైనల్కు పిచ్చ క్రేజ్
ఐపీఎల్ ఒక అద్భుతమైన టోర్నమెంట్, ఇక్కడ 100 శాతం కంటే ఎక్కువ శక్తిని ఇవ్వాలి. “ఈ టోర్నమెంట్ చాలా కఠినమైనది. ప్రపంచ క్రికెట్లో దీనికి గొప్ప విలువ ఉంది. నేను ఎప్పుడూ పెద్ద టోర్నమెంట్లు గెలవాలని కోరుకుంటాను,” అని కోహ్లీ అన్నాడు. ఆ తరువాత ఐపిల్ రిటైర్మెంట్ పై కూడా కోహ్లీ స్పందించాడు. “క్రీడాకారుల కెరీర్ చాలా చిన్నది, కాబట్టి ప్రతి రోజును విలువైనదిగా భావిస్తాను. మా కెరీర్కు త్వరగా ఒక ముగింపు తేదీ ఉంటుంది. నేను రిటైర్ అయ్యేటప్పుడు, నేను అన్నీ ఇచ్చానని గర్వంగా భావించాలనుకుంటున్నాను,” అని అతను చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడటం కోహ్లీకి ఇష్టం లేదని చెప్పాడు. మొత్తం 20 ఓవర్లు ఆడాలనే తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నాడు. “నేను 20 ఓవర్లూ మైదానంలో ఉండి, జట్టుకు సహాయం చేయాలనుకుంటాను. దేవుడు నాకు ఆ దృక్పథాన్ని, ప్రతిభను ఇచ్చాడు. ఫిట్ నెస్ ఉన్నంతవరకు ఆడుతాను. ఆ తరువాత జట్టుకు సహాకుడిగా, కోచ్గా నా సేవలను కొనసాగిస్తాను” అని కోహ్లీ తన మనసులో భావాలను వెల్లడించాడు.