Shoaib Akhtar On Imran Khan: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఒకప్పుడు అత్యంత ప్రమాదకరమైన బౌలర్ గా ఉన్న సంగతి తెలిసిందే. 160 స్పీడ్ తో కూడా కొన్నిసార్లు బౌలింగ్ చేసేవాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. అంతటి గొప్ప బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ), తన కెరీర్ లో కేవలం 400 మాత్రమే సాధించడం గమనార్హం. అయితే ఇదే అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షోయబ్ అక్తర్, కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టులో తాను ఆడినప్పుడు కొంత మంది దద్దమ్మలు కెప్టెన్లు ఉండేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వల్ల 400కు పైగా వికెట్లు తీయలేక విఫలమైనట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు.
400కు పైగా వికెట్లు తీయక పోవడంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రముఖ టాక్ షో హస్నా మానా హైలో షోయబ్ అక్తర్ ను నటుడు, యాంకర్ తబిష్ హాష్మీ ( Tabish Hashmi) ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. తన కెరీర్ గురించి షోయబ్ అక్తర్ సీరియస్ కామెంట్స్ చేయగా, తబిష్ హాష్మీ మాత్రం పొలిటికల్ టచ్ ఇస్తూ పంచులు వేశాడు. తన అంతర్జాతీయ క్రికెట్ లో 400 వికెట్లు తీసేందుకు చాలా కష్టపడ్డానని షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఐదు సంవత్సరాల కెరీర్ లో ఏకంగా పాకిస్తాన్ జట్టుకు ఏడుగురు కెప్టెన్లు మారారని బాంబు పేల్చారు.
ఇలా ఏడుగురు కెప్టెన్ల ఆధ్వర్యంలో తాను ఆడడం వల్ల, తనకు సరైన అవకాశాలు రాలేదని మండిపడ్డారు. స్థిరత్వం తనకు లభించలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎక్కువ వికెట్లు తీయలేకపోయానని తెలిపారు. ఒకవేళ లెజెండరీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ గనక తన కెప్టెన్ అయి ఉంటే కెరీర్ మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. స్థిరంగా తనకు అవకాశాలు వచ్చి.. ఎక్కువగా వికెట్లు తీసే వాడినని పేర్కొన్నారు. అయితే షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలకు తబిష్ హాష్మీ కౌంటర్ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో నువ్వు గొప్ప బౌలర్ అయివుంటే… అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ తరహాలో జైలులో కూడా చిప్పకూడు తినేవాడివని చురకలు అందించారు. దీంతో షోయబ్ అక్తర్ పగలబడి నవ్వారు.
ఇది ఇలా ఉండగా, పాకిస్తాన్ మాజీ ప్రధాని, ఒకప్పటి లెజెండరీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనపై దాదాపు 200కు పైగా కేసులు ఉన్న నేపథ్యంలో జైలు జీవితాన్ని గడుపుతున్నారు. సౌదీ అరేబియా లాంటి విదేశీ ప్రభుత్వాల నుంచి అత్యంత విలువైన బహుమతులను ప్రభుత్వ ఖజానా నిబంధనలకు విరుద్ధంగా చాలా తక్కువ ధరకు సొంతం చేసుకున్నాడని.. దానిద్వారా కోట్లు సంపాదించాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ జైల్లో చిప్పకూడు తింటున్నాడు.