![Virat Kohli](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/11/fe0655e9ef6519ae61261ac458996912.jpg)
Virat Kohli : వన్డే ప్రపంచకప్ 2023 దెబ్బ మామూలుగా తగల్లేదుగా.. ఆటగాళ్లు మానసికంగా బాగా కుంగిపోయారు. కోలుకోడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ప్రపంచానికి ముఖం చూపించలేనంతగా అజ్నాతంలోకి వెళ్లిపోయారు.
ఈ సమయంలో విరాట్ కోహ్లీ తీసుకున్న ఒక నిర్ణయం క్రీడా ప్రపంచాన్ని విస్మయంలోకి నెట్టేసింది. ఇంకా వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడతాడు.. సచిన్ కొట్టిన 100 సెంచరీలకు ఇంకా 20 దూరంలోనే ఉన్నాడు. అవి కూడా పూర్తి చేసేస్తాడు. ఇక ఆఖరిగా 2027 వరల్డ్ కప్ ఆడి సచిన్ లా ఘనంగా రిటైర్ అవుతాడని అంతా అనుకున్నారు.
ఇంతలోనే ఒక బాంబ్ పేల్చాడు. వైట్ బాల్ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని విరాట్ కోహ్లీ నిర్ణయించుకున్నాడని సమాచారం. సౌతాఫ్రికా పర్యటన కోసం జట్టును ఎంపిక చేసే సమయంలో ఇదే విషయాన్ని బీసీసీఐకి కోహ్లీ తెలియజేసినట్టు తెలిసింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కైవసం చేసుకోవడమే కాదు, రికార్డుల మీద రికార్డులు తిరగరాసి, కొన్నింటిని బద్దలు కొట్టిన కోహ్లీ అనూహ్యంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై క్రికెట్ అభిమానులు షాక్ కి గురవుతున్నారు.
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత.. విరాట్ కోహ్లీ టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు వన్డేల్లో వైట్ బాల్ క్రికెట్ కి కూడా దూరం అవుతుండటంపై సగటు భారత క్రికెట్ అభిమాని కొహ్లీ ఎందుకింత పనిచేశాడని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
వరల్డ్ కప్ 2023 ముందు నుంచి ఎడతెరిపి లేని క్రికెట్ ఆడుతున్న కోహ్లీ బహుశా సౌత్ ఆఫ్రికా టూర్ కి వెళ్లలేక ఆగినట్టు ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సిరీస్లో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. అదైన తర్వాత మళ్లీ అందుబాటులోకి కోహ్లీ వస్తాడని అంటున్నారు.
బ్రేక్ అన్నాడంతే, అందుకు కంగారుపడాల్సిన పనిలేదని కొందరు అంటున్నారు. సౌతాఫ్రికా పర్యటన కోసం సెలెక్టర్లు ఇంకా జట్టును ప్రకటించలేదు. విరాట్ కోహ్లీ బ్రేక్ సంగతి ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక రాసిన కథనంలో వచ్చింది.
ఈ నేపథ్యంలో బహుశా కోహ్లీని టీ 20, వన్డేలకు సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశాలు లేవని అంటున్నారు. మరి టెస్ట్ మ్యాచ్ లకి ఎంపిక చేస్తే మరి వెళతాడా? అనేది సందేహంగా మారింది. టోటల్ గా సౌతాఫ్రికా టూర్ కి దూరంగా ఉంటాడని అంటున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ సౌతాఫ్రికా పర్యటన కోసం మూడు ఫార్మాట్లకు ఆటగాళ్లను ఎంపిక చేయనుంది.