CM Revanth: మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవం పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.7,360 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ప్రాజెక్టను నిర్మాణపనులను చేపట్టింది. మొత్తం రెండేళ్ల కాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
మూసీ పునరుజ్జీవం పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేలా పథకం రూపకల్పన చేశారు. హైదరాబాద్ కు 20 టీఎంసీల గోదావరి నీళ్లు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 ప్రాజెక్టు పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 17.5 టీఎంసీలు కేటాయించారు. మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీల నిరును కేటాయించారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కు గండిపేట దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ ఖర్చుకు అవసరమయ్యే నిధుల్లో 60 శాతం నిర్మాణ సంస్థలు భరించనున్నాయి. 40 శాతం ఖర్చును జలమండలి సమకూర్చునున్నది. జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన.. 16 జలాశయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 1908 లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను వరదల నుంచి కాపాడిందని అన్నారు. వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతున్నాయంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టినే కారణమని చెప్పారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని తెలిపారు. 1965 లో మంజీరా నది నుంచి నగరానికి తాగు నీరు అందించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. 2002 లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదని సీఎం పేర్కొన్నారు.
కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారని బీఆర్ఎస్ పై పరోక్షంగా సీఎం కౌంటర్ ఇచ్చారు. ‘నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది. కాలుష్యమయమైన మూసీతో నల్లగొండ జిల్లా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచ్చా. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించబోతున్నాం. ఇందులో 17.5 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం వినియోగించబోతున్నాం. చెరువులను నింపుకుంటూ 2.5 టీఎంసీలను మూసీకి తరలించి మూసీని ప్రక్షాళన చేస్తాం’ అని సీఎం తెలిపారు.
శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్ తరలిస్తున్నాం. ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు. చేవెళ్లలో వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాసుల కక్కుర్తితో తలను తొలగించింది మీరు కాదా..? చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకపోవడానికి కారణం మీరు కాదా..? తుమ్మిడిహెట్టీ దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం. గంగా నదీ, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చు… కానీ మేం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దా.. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరుతున్నా. తెలంగాణ రైసింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9 న తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యం.. పేదోళ్ల రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుంది’ అని సీఎం వ్యాఖ్యానించారు.
ALSO READ: Dussehra holidays: తెలంగాణలో దసరా సెలవు.. విద్యార్థులు ఫుల్ ఎంజాయ్, టూర్ ప్లానింగ్