Minister Sitakka: ప్రపంచంలో అత్యంత వెనుకడిన జాతులు గిరిజన ఆదివాసులే అని మంత్రి సీతక్క అన్నారు. ఎస్టీల అభివృద్ధికి ఐకమత్యంతో కలిసి పని చేసుకుందామని పేర్కొన్నారు. మాసాబ్ ట్యాంక్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి సీతక్క, ట్రైకార్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో గిరిజన, ఆదివాసీల సంక్షేమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, విప్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రాందాస్ నాయ్, వెడ్మ బొజ్జు, జాలే ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, అనిల్ జాధవ్, ట్రైకార్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై నివేదకి సమర్పించాలని మంత్రి సీతక్క కోరారు. ‘నివేదిక ఆధారంగా బడ్జెట్లో ప్రత్యేక స్కీం రూపొందించుకుంటాం. సమాజానికి దూరంగా ఉన్న మన జాతుల అభివృద్ధి కోసం లక్ష్యంతో పని చేద్దాం. గిరిజన సంక్షేమాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గిరిజన సంక్షేమం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత పది సంవత్సరాల్లో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వం పోడు సమస్యలను పట్టించుకోలేదు. ఐటీడీఏలను బలహీనపరిచింది. ఇందిరా జలప్రభ వంటి పథకాలకు నీళ్లు కేటాయించకుండా నిర్వీర్యం చేసింది. గిరిజన ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. ఎస్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించిన అంశాలను సీఎంకు నివేదిస్తాం. రేపు ముఖ్యమంత్రి గారితో ఎస్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం అవుతాం. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవల కోసం రూ. 2 కోట్లు కేటాయిస్తున్నాం. ప్రతి గిరిజన పాఠశాలలో, తండాల్లో సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఫిబ్రవరి 15న ఘనంగా నిర్వహించుకుందాం’ అని సీతక్క వ్యాఖ్యానించారు.
‘ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలలే సమయమే మిగిలి ఉంది. ఎస్టీ సంక్షేమ శాఖకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. అధికారులు పనులను వేగవంతం. ఎస్టి సంక్షేమ శాఖ నిధులు ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళించ వద్దు. గిరిజన ప్రాంతాల్లో, ఐటిడిఏ ఏరియాల్లో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. గిరిజన పాఠశాలల్లో, వసతి గృహాల్లో తాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, భవనాల నిర్మాణం కోసం రూ. 250 కోట్లు కేటాయిస్తున్నాం. తక్షణం పనులు ప్రారంభించండి. గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు, హాస్టల్లో సిబ్బంది ఖాళీల జాబితాను సమర్పించండి. సీఎంతో చర్చించి పోస్టుల భర్తీ ప్రక్రియను షురూ చేస్తాం. మూడు ఎస్టీ కార్పొరేషన్లను బలోపేతం చేయాలి. ఐటీడీఏ పరిధిలో ఉన్న 29 ప్రభుత్వ శాఖలను పటిష్ట పరచాలి. హైదరాబాదులో రెండు పోస్ట్ మెట్రిక్ గిరిజన హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి. ఎస్టీ విద్యార్థుల కోసం అదనంగా 250 ఓవర్సీస్ స్కాలర్షిప్ లు మంజూరు చేయాలి. సేవాలాల్ జయంతి ఉత్సవాల కోసం జిల్లాలకు ప్రత్యేక అధికారులను కేటాయించాలి’ అని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు.
‘ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గలో గిరిజన సంక్షేమ భవన నిర్మాణం కోసం కోటి రూపాయలు మంజూరు చేస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో అదనంగా 10 నుంచి 15 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. గిరిజన ప్రాంతాల్లో యూత్ ట్రైనింగ్ సెంటర్ ల బలోపేతం కోసం చర్యలు తీసుకుంటున్నాం. మైదాన ప్రాంతాల కోసం కొత్తగా ఐటిడీఏను ఏర్పాటు చేయాలి. ఎస్టీ వసతి గృహాల్లో గీజర్లు, వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయాలి. అవసరం ఉన్న మండలాల్లో ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఆశ్రమ పాఠశాలలను అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ విద్యను బోధించాలి. ఇందిరమ్మ గిరి వికాసంను పునరుద్ధరించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీ ఏరియాలో మాతృభాషలో విద్యా బోధన జరిగేలా చర్యలు చేపట్టాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో కళాశాలలో రెగ్యులర్ టీచర్లను పని చేయాలి. గిరిజనులకు ఆర్దిక చేయూత ఇచ్చేందుకు వంద కోట్ల ట్రైకార్ సబ్సిడీ నిధులను తక్షణం విడుదల చేయాలి’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.