![congress cpi cpm](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/08/congress-cpi-cpm.jpg)
Congress: బీఆర్ఎస్తో పొత్తు ఆశలు అడియాశలు కావడంతో.. కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి కొనసాగింపుగా.. తెలంగాణలోనూ పొత్తు పెట్టుకుందామని ప్రపోజల్స్ ఇరువైపుల నుంచీ వస్తున్నాయి. వామపక్షాలు పొత్తులకు రెడీగా ఉన్నాయి. కాకపోతే, తాము అడిగిన సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పొత్తు పెట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ.. వారు అడిగిన స్థానాలే కాంగ్రెస్కు సంకటంగా మారుతున్నాయని తెలుస్తోంది.
తమకు బలంగా ఉన్న చోట్లలో బరిలో దిగి.. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని వామపక్షాలు భావిస్తున్నాయి. సీపీఐ.. మునుగోడు, వైరా, కొత్తగూడెం, బెల్లంపల్లి, హుస్నాబాద్ స్థానాలు ఆశిస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మునుగోడు, హుస్నాబాద్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక భద్రాచలం, పాలేరు, మధిర, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం సీట్లను సీపీఎం కోరుకుంటోంది. హస్తం పార్టీ మాత్రం మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండు పార్టీలకు చెరో ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పచ్చజెండా ఊపినట్టు సమాచారం.
హుస్నాబాద్ బరిలో కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. మునుగోడు నుంచి పాల్వాయి సునీత సైతం మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ స్థానాలు కమ్యూనిస్టులకు వెళ్తే తమ పరిస్థితి ఏంటని వారిలో గుబులు మొదలైంది.