Bhagirath Case: స్వేచ్ఛ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ముసురుకున్న పోక్సో కేసు వివాదం తెలంగాణ బీజేపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ‘భగీరథ’ అంశం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ లైన్కు కట్టుబడి ఉండాలా లేక సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలా అనే అంశంపై నేతల్లో తీవ్ర అంతర్మథనం నడుస్తోంది. ఈ కేసు అంశంలో భగీరథ్ ను అప్పజెప్పుంటేనే బాగుండేదని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు ఆస్కారముండేదని వారు భావిస్త్ఉన్నారు. ఎందుకంటే వివాదాస్పద అంశాన్ని ఆదిలోనే ముగించి ఉంటే ఇక్కడి వరకు పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు. విషయాన్ని సాగదీయడం వల్ల పార్టీ కేడర్లో అనవసర అయోమయం నెలకొందని చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్ గెలుపు స్ఫూర్తితో తెలంగాణలో అధికారాన్ని సాధించాలని ఈనెల 10న ప్రధాని మోడీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ ద్వారా శ్రేణుల్లో జోష్ నింపాలని ప్రణాళికలు రచించారు. కానీ ఈ సభ ద్వారా శ్రేణుల్లో బూస్ట్ నింపడం అంశం పక్కకుపెడితే.. భగీరథ ఇష్యూయే సభను డామినేట్ చేసిందని, దీంతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రజల్లోకి వెళ్లాల్సిన తరుణంలో ఇతర ప్రజా సమస్యలను వదిలేసి ఈ అంశం వల్ల ఆగిపోవాల్సి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. మోడీ సభ వల్ల రావాల్సిన పాజిటివ్ వైబ్ను ఈ వివాదం నీరుగార్చిందని శ్రేణులు భావిస్తున్నాయి.
ఇదిలాఉండగా ఈఅంశంపై స్పందించాలా? వద్దా? అనే అయోమయంలో ఉన్నట్లు సమాచారం. సపోర్ట్ చేయలేక.. సైలెంట్గా ఉండలేక.. ధర్మసంకటంలో కొందరు నేతలు ఉన్నట్లు సమాచారం. కొందరు నేతలకు అంతర్గతంగా మద్దతు ఇవ్వాలని ఉన్నా.., బయటకు మాట్లాడలేని పరిస్థితి ఉందని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే బహిరంగంగా సపోర్ట్ చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఒకరి వ్యక్తిగత వివాదాన్ని పార్టీ కోర్ ఎజెండా అయిన హిందుత్వంతో ముడిపెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవిత్రమైన హిందుత్వ భావజాలాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే అసంతృప్తి పలువురిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంతర్గత ఘర్షణ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read: కేరళం చుట్టూ కొత్త రాజకీయాలు.. కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం, ఏం జరుగుతోంది?
ఇదిలాఉండగా బండి భగీరథ్ ఇష్యూతో.. బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టంచేశారు. ఇది వారి వ్యక్తిగత సమస్య అని, దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. పార్టీకి ఎంతో మేలు చేస్తుందని ఆశించిన ప్రధాని మోడీ రాబోయే సభ మైలేజీని.. ఈ వ్యక్తిగత వివాదం దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధాంత పరమైన పునాదులతో ఎదిగిన పలువురు సీనియర్ నేతలు, ఇటువంటి సున్నితమైన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి హిందుత్వ లేదా రాజకీయ కక్షసాధింపు అనే కార్డులను వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. తప్పు జరిగితే చట్టప్రకారం తేల్చుకోవాలే తప్ప, పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టవద్దనేది వారి వాదన.
ఇకపోతే ఈ ఇష్యూను బీఆర్ఎస్ మహిళా విభాగం, శ్రేణులు ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాయి. బండి సంజయ్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని, కేంద్ర కేబినెట్ నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేయడంలో జాప్యం జరుగుతోందని, బీజేపీ-కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య అంతర్గత లాలూచీ ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మహిళల రక్షణ గురించి మాట్లాడే బీజేపీ.., అందులోనూ స్వయంగా ఒక కేంద్ర మంత్రి కుమారుడు పోక్సో కేసులో నిందితుడిగా ఉంటే ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించి.. చట్టానికి ఎవరూ అతీతులు కారని, డీజీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని(సిట్)ను ఏర్పాటు చేశారు.
ఈ ఇష్యూ భవిష్యత్ ఎన్నికలపైనా ప్రభావం చూపించే అవకాశాలున్నాయని పలువురు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పోక్సో ఆరోపణలు కావడంతో మహిళా ఓటర్లలో పార్టీపై ప్రతికూలత పెరిగే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ అంశంలో బండి భగీరథ్ చెప్పినట్లుగా హనీ ట్రాప్ అయితే విచారణకు ఎందుకు ముందుకురావడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యత కలిగిన హోదాలో ఉన్న బండి సంజయ్.. ఎందుకు భగీరథ్ ను సరెండర్ చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు. పార్టీ నైతిక విలువలను ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల వల్ల తటస్థ ఓటర్లు పార్టీకి దూరమయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ వివాదం డిఫెన్స్లో పడేసినట్లయిందని పలువురు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దీనిని రాజకీయంగా వాడుకుని క్షేత్రస్థాయిలో మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నాయని, పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ కేసులో బండి భగీరథ విచారణకు హాజరై తాను చెప్పినవి వాస్తవాలని నిరూపిస్తే తప్ప.. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా చూడొచ్చని పలువురు భావిస్తున్నారు.
Also read: కాంగ్రెస్ మరో కొత్త ప్లాన్.. ఓకే దెబ్బకు రెండు పిట్టలు!