Greenfield Airport: స్వేచ్చ బ్యూరో: దశాబ్దాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కల సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇప్పటికే ప్రతిపాదిత స్థలాలు సాంకేతిక, ఆర్థిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో, జిల్లా యంత్రాంగం ద్వారా ప్రత్యామ్నాయ స్థలాలపై చేపట్టిన సమగ్ర సాధ్యాసాధ్యాల అధ్యయన నివేదికను వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడుకు అందజేశారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటుపై గతంలో తాను పంపిన లేఖలను ప్రస్తావిస్తూ, తాజా పరిణామాలను ఇందులో వివరించారు.
జులై 4నమంత్రి తుమ్మల లేఖ రాశారు.
కొత్తగూడెం సమీపంలో గతంలో ప్రతిపాదించిన రెండు స్థలాల్లో ఒకటి సాంకేతికంగా, మరొకటి ఆర్థికంగా (భూసేకరణకు) అనుకూలం కాదని తేలడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచన మేరకు జిల్లా యంత్రాంగం స్వతంత్ర సాంకేతిక సంస్థ ‘రాజ్ టెక్నాలజీస్’ను రంగంలోకి దించి, సాంకేతికంగా, ఆర్థికంగా అనుకూలమైన కొత్త స్థలాలను గుర్తించే బాధ్యతను అప్పగించింది. ఇటీవల ఢిల్లీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్ర మంత్రిని కలిసినప్పుడు, కొత్త స్థల ప్రతిపాదనపై పది రోజుల్లో ఫీజిబిలిటీ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ మేరకు నిర్దేశిత గడువులోగానే నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి పంపడం గమనార్హం.
ఏటీఆర్ – 72 – 600 తరహా విమానాలకు అనుగుణంగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో భూమి లభ్యత, భూతల స్వరూపం, రన్వే దిశ, ఎత్తు పరిమితి ఉపరితలాలు (అబ్ స్టకల్ లిమిటేషన్ సర్ఫేసెస్), పర్యావరణ అంశాలు, రవాణా సౌకర్యాలను నిపుణుల బృందం క్షుణ్నంగా పరిశీలించింది. ఈ ప్రాథమిక సాధ్యాసాధ్యాల అధ్యయనంలో సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాలు అవసరమైన కీలక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా, అనుకూలమైన భూతలం, భూవినియోగం, నిర్వహణ పరిస్థితులతో ఉన్నట్లు తేలింది. సుమారు 667 ఎకరాల ప్రతిపాదిత అభివృద్ధి స్థలాన్ని ఎలాంటి ప్రధాన పర్యావరణ, సాంకేతిక అవరోధాలు లేకుండానే సమకూర్చవచ్చని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఏళ్లుగా నానుతున్న స్థల నిర్ధారణ సమస్యకు తెరపడే అవకాశం కనిపిస్తోంది.
Also read: ACB Raids: పట్టుకున్న ఫలితం శూన్యం.. వారికి భయం పుట్టించడంలో విఫలమవుతున్న సర్కార్!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటమే కాక, విశాలమైన గిరిజన, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోందని మంత్రి తుమ్మల తన లేఖలో పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు గనులు, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ, బీపీఎల్ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు ఈ జిల్లా నిలయంగా ఉందని వివరించారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారని, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వారి ప్రయాణం మరింత సులభతరమవుతుందని తెలిపారు. అంతేకాక, జిల్లాలోని అటవీ సంపద, ఖనిజ వనరులు, ఎకో టూరిజం అవకాశాలు, ప్రతిపాదిత ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులకు విమానాశ్రయం మరింత బలం చేకూరుస్తుందని, తద్వారా పెట్టుబడులు పెరిగి విద్యా, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు.
ఫీజిబిలిటీ నివేదికను దయచేసి పరిగణనలోకి తీసుకుని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని తుమ్మల తన లేఖలో అభ్యర్థించారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందిస్తాయని హామీ ఇచ్చారు. ఫీజిబిలిటీ అధ్యయన నివేదిక ప్రతిని కూడా లేఖతో పాటు కేంద్ర మంత్రికి జతచేసినట్లు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసుల దశాబ్దాల కల అయిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, తాజా పరిణామాలతో సాకారానికి మరింత చేరువైందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రం నుంచి తుది ఆమోదం లభిస్తే, గిరిజన, పారిశ్రామిక, పుణ్యక్షేత్ర ప్రాధాన్యత కలిగిన ఈ జిల్లాకు గగనతల అనుసంధానం ఏర్పడి, ప్రాంతీయ ఆర్థిక ముఖచిత్రమే మారిపోనుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
Also read: Annam Foundation: కేసముద్రం బడి తండాలో హార్ట్ టచింగ్ సీన్.. బిగ్ టీవీ వార్తతో యువకుడికి పునర్జన్మ!