Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన నెలలో వర్షాలు అంతగా కొట్టలేదు. జూన్ నెలలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, గత నాలుగు, ఐదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతాయని తెలిపింది. మొత్తం 15 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు వివరించింది. ఇప్పటికే భారీ వర్షాల వల్ల ఉత్తర తెలంగణలోని గోదావరి పరివాహాక ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతున్న విషయం తెలిసిందే. ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, వరంగల్, నాగర్కర్నూల్, మంచిర్యాల, నిర్మల్, గద్వాల్, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని వివరించారు.
ALSO READ: SSC: టెన్త్ అర్హతతో 1075 ఎంటీఎస్ పోస్టులు.. నెలకు రూ.56,900 జీతం, మిస్ అవ్వొద్దు
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. మరోవైపు కృష్ణా బేసిన్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఈ పరివాహాక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే కర్ణాటకలోని నారాయణ్పూర్, తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులు నిండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్కు నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇప్పటికే రెండు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్తత్తి చేసి నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు. ఇదే నీటి ఫ్లో కంటిన్యూ అయితే.. శ్రీశైలం ప్రాజెక్ట్కు మరో ఒకటెండ్రు రోజుల్లో డ్యామ్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదలచేయనున్నారు.
ALSO READ: Prasar Bharati: అద్భుతమైన అవకాశం.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. సైఫండ్ ఇచ్చి ఉద్యోగం
అయితే.. ఉరుములు, పిడుగుల వర్షం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.