BRS Party: బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీల వ్యవహారశైలి కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి వారు పార్టీ వ్యవహరాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పోటీచేసిన నియోజకవర్గాల్లోనూ కేడర్ కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. రాష్ట్రంలో తమపార్టీ అధికారంలో లేకపోవడంతోనే వారు ఇలా అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ ఎంపీ అభ్యర్థిని చూడాలని ప్రయత్నించినప్పటికీ వారు ఎక్కడ కనిపించకపోవడంతో బీఆర్ఎస్ కేడర్ లోనూ గందరగోళం ఏర్పడుతున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
పార్లమెంటు ఎన్నికలు కంప్లీట్ అయి రెండేళ్లు అయినా కనీసం పార్టీ ఆఫీసుకు రాకుండా బీఆర్ఎస్ ఎంపీలు ముఖం చాటేస్తున్నారు. అసలు వారు పార్టీలోనే ఉన్నారా? అనే అనుమానం కలుగజేస్తున్నారు. కనీసం పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ కు సైతం రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు టికెట్ కోసం పార్టీ కార్యాలయం, కేసీఆర్ చుట్టూ ప్రతి నిత్యం ప్రదక్షిణలు చేసిన నేతలు.. ఇప్పుడు కనిపించకుండా పోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు విస్మయానికి గురవుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ తన ఎంపీ అభ్యర్థులను ఆచితూచీ ఎంపిక చేసింది. కానీ కేసీఆర్ నమ్మకాన్ని వారు నిలబెట్టుకోలేకపోయారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏకంగా 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్నగర్, జహీరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదు. గులాబీకి కంచుకోటగా ఉండే కరీంనగర్తో పాటు పెద్దపల్లి, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్కర్నూల్ స్థానాల్లోనూ మూడో స్థానానికే ఆ పార్టీ పరిమితమైంది. దీంతో ఘోర ఓటమిని చవిచూడటంతోనే ప్రజల మధ్యకు రావడం లేదా? అనేది కేడర్ లో జోరుగా చర్చ జరుగుతోంది.
పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు నియోజకవర్గాలకు దూరంగా ఉండటంతో కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పదవి లేకున్నా ప్రజల మధ్య ఉండి వారి సమస్యలపై పోరాడాల్సిన నేతలు ముఖం చాటేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలప్పుడే టికెట్ తీసుకొని నియోజకవర్గానికి వస్తామంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే వస్తాయని అంటున్నారు. ఇప్పటికైనా నేతలు ప్రజల్లోకి వచ్చి వారి పక్షాన నిలబడాలని పలువురు కోరుతున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ కు సమస్యలు వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాని పరిస్థితి నెలకొందని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు.
బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధి, డి. దామోదర్ రావు ఉన్నారు. వీరిలో రవిచంద్ర మాత్రమే తరచుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిగిలిన ఇద్దరు దూరంగా ఉంటున్నారు. వీరైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే పార్టీ కేడర్ లో కొంత జోష్ వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంపీ అభ్యర్థులుగా సరైన నేతలకు టికెట్లు ఇవ్వకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కోసం పనిచేసే నేతలకు టికెట్లు ఇస్తే నియోజకవర్గాల్లో ఉండేవారని శ్రేణులు పేర్కొంటున్నారు.
Also Read: Family Drama OTT: ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఏడిపించే స్టోరీ… బంధాలను గుర్తు చేస్తూ… 8.4 రేటింగ్ కూడా