CM Revanth Reddy : దావోస్ వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేశారు. తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడులు సాధించారు. అదే లక్ష్యంతో ఇప్పుడు జపాన్ పర్యాటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఓసాకా వరల్డ్ ఎక్స్పో 2025 లో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు.
జపాన్ టూర్ ఎన్ని రోజులంటే..
ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశాలు నిర్వహించనుంది. తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు.. 10 రోజుల పాటు జపాన్ పర్యటన కొనసాగుతుంది. సీఎం రేవంత్రెడ్డి అధికారుల బృందం వెళ్లింది. మంత్రి శ్రీధర్బాబు ఏప్రిల్ 18న జపాన్ చేరుకుంటారు. జపాన్లోని టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమా నగరాల్లో ముఖ్యమంత్రి బృందం పర్యటించనుంది.
సీఎం రేవంత్రెడ్డి జపాన్ షెడ్యూల్:
ఏప్రిల్ 16న జపాన్ చేరుకుంటారు. టోక్యోలో భారత రాయబారితో అతిథ్య సమావేశం ఉంటుంది. ఏప్రిల్ 17న.. సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ, JETRO, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ తదితర సంస్థలతో ముఖ్యమంత్రి బృందం మీటింగ్స్ ఉంటాయి. అనంతరం తోషిబా ఫ్యాక్టరీని సందర్శిస్తారు.
ఏప్రిల్ 18న.. టోక్యోలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. టోక్యో గవర్నర్తో భేటీతో పాటు ఇండియన్ ఎంబసీ అధ్వర్యంలో ఇండస్ట్రీ ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. టయోటా, తోసిబా, ఐసిన్, ఎన్టీటీ తదితర కంపెనీల సీఈవోలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం, జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులతో మీటింగ్ ఉండనుంది. సుమిదా రివర్ ఫ్రంట్ను సందర్శిస్తారు సీఎం రేవంత్రెడ్డి.
ఏప్రిల్ 19న.. టోక్యో నుంచి ఒసాకా వెళ్తారు. మౌంట్ ఫుజి అగ్నిపర్వతం, అరకురయామా పార్క్ను విజిట్ చేస్తారు. ఏప్రిల్ 20న.. కిటాక్యూషు సిటీకి వెళ్లి.. ఎకో టౌన్ ప్రాజెక్టుపై అక్కడి మేయర్తో చర్చిస్తారు. మురసాకి రివర్ మ్యూజియం చూస్తారు. ఎన్విరాన్మెంట్ మ్యూజియం & ఎకో టౌన్ సెంటర్ సందర్శన ఉంటుంది.
ఏప్రిల్ 21న.. ఒసాకాలో యుమెషిమాలో వరల్డ్ ఎక్స్ఫోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభిస్తారు సీఎం రేవంత్. బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తారు. అనంతరం, ఒసాకా రివర్ ఫ్రంట్ సందర్శనకు వెళ్తారు. ఏప్రిల్ 22న.. ఒసాకా నుంచి అణుబాంబు దాడి నుంచి పునర్నిర్మితమైన హిరోషిమా నగరాన్ని విజిట్ చేస్తారు. హిరోషిమా పీస్ మెమోరియల్, గాంధీ విగ్రహాన్ని సందర్శిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్తో సమావేశాలు ఉంటాయి. హిరోషిమా జపాన్–ఇండియా చాప్టర్తో బిజినెస్ లంచ్ ఉంటుంది. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని తెలంగాణ బృందం సందర్శించనుంది. అనంతరం, ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి.. ఏప్రిల్ 23 ఉదయం హైదరాబాద్కు చేరుకుంటారు సీఎం రేవంత్రెడ్డి అండ్ టీమ్. ఇదీ జపాన్ టూర్ షెడ్యూల్.
Also Read : కూల్చేస్తారా? రేవంత్ను టచ్ చేసి చూడు..
Also Read : ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్.. ఎందుకంటే..