CM Revanth Reddy: ప్రపంచం మొత్తం వరంగల్ వైపు చూసేలా.. అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హనుమకొండ లోని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉక్కు మహిళగా ప్రపంచానికి పరిచయమైన ఇందిరమ్మ 17వ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లాలో తమ ఏడాది పాలన పూర్తి సందర్భంగా సభను నిర్వహించడం తనకు ఆనందంగా ఉందంటూ సీఎం తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని మహిళలందరూ తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని, సోనియమ్మ ఆశీర్వాదంతో తాను ముఖ్యమంత్రి అయ్యానన్నారు.
ఆ పాలనలో మహిళలకు చోటు లేదు..
2014 నుండి 19 వరకు సాగిన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు, అన్ని కీలక పదవుల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఆడబిడ్డల రాజ్యం.. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యమని, మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా సంక్షేమ పథకాల గురించి సీఎం వివరించారు.
వరంగల్ అభివృద్ధికి సుమారు రూ. 6 వేల కోట్లు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు తలమానికంగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు సుమారు రూ. 6 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచం దృష్టిలో ఒక చారిత్రాత్మక నగరంగా వరంగల్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని, వరంగల్ అభివృద్ధి ఉత్తర తెలంగాణ అభివృద్ధికి తలమానికమన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అహర్నిశలు కృషిచేసి, వరంగల్ అభివృద్ధికి పూర్తి ప్రణాళికను సిద్ధం చేశారని, ఈ సందర్భంగా బహిరంగ సభలో మంత్రి పొంగులేటిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
చివరి రక్తపు బొట్టు వరకు అభివృద్దే నా లక్ష్యం..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పూర్తి చేసుకుందని సీఎం రేవంత్ అన్నారు. మరో నాలుగు సంవత్సరాలు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా చివరి రక్తపు బొట్టు వరకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజా సంక్షేమం కోసమే కేటాయిస్తానంటూ సీఎం తెలిపారు. సీఎం బహిరంగ సభలో చేసిన ఈ కామెంట్స్ కి బహిరంగ సభకు హాజరైన ప్రజలు తమ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
ప్రతి నెలా ఆదాయం రూ. 18500 కోట్లు కానీ..
తెలంగాణ రాష్ట్ర ప్రతినెల ఆదాయం రూ. 18,500 కోట్లు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా జీతభత్యాలకై రూ.6500 కోట్లు ఖర్చవుతుందని, మరో రూ. 6500 కోట్లు గత పాలకులు చేసిన అప్పుల వడ్డీలకు సరిపోతుందని, మిగిలిన మిగిలిన నిధులను ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు.
ఇప్పటికే తాము ఇచ్చిన హామీలను నెరవేర్చామని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా నోటిఫికేషన్స్ కూడా విడుదల చేసి పలు పోస్టులను భర్తీ చేశామన్నారు. పక్క రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఎయిర్ పోర్టులు కనిపిస్తున్నాయని, మన తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్ పోర్టు హైదరాబాద్ లో ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నాలుగు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేసేంతవరకు నిరంతర కృషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వం సైతం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా, సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు సీఎం. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మేల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.